Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్సు పునరుద్ధరణ
- Author : Vamsi Chowdary Korata
Date : 24-03-2026 - 11:45 IST
Published By : Hashtagu Telugu Desk
FCRA License కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద విదేశీ నిధులకు బ్రేకులు వేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో మళ్లీ పునరుద్ధరించారు. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తెలుగు రాష్ట్రాలకూ, అనంతపురం జిల్లావాసులకూ కేంద్రం నుంచి తీపి కబురు అందింది. అనంతపురం ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) సేవలకు అనుమతి లభించింది. ఆర్డీటీ విదేశీ నిధులు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆర్డీటీ విదేశీ నిధులు వినియోగించుకునేందుకు వీలుగా ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేసినట్లు ఆర్డీటీ ప్రతినిధులకు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం అందింది. ఆర్డీటీకి లైన్ క్లియర్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తెలిపారు.
దశాబ్దాలుగా పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కు విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధాని మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్…
— N Chandrababu Naidu (@ncbn) March 24, 2026
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.
లక్షలాది మంది సంతోషించే సమాచారం.
ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో… pic.twitter.com/4JQyBtV7OW— Lokesh Nara (@naralokesh) March 24, 2026
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ అనంతపురం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో విద్య, వైద్యం, స్వయం ఉపాధి వంటి సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఆర్డీటీకి విదేశాల నుంచి నిధులు వస్తుంటాయి. అయితే ఈ నిధుల వినియోగానికి అనుమతుల్ని కేంద్రం నిలిపివేసింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) కింద కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి ఆర్డీటీకి సంబంధించి ఫారిన్ కాంట్రిబ్యూషన్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని వినియోగించడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆర్డీటీ సేవా కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. ఏపీ ప్రభుత్వం ఆర్డీటీకి సంబంధించిన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు వినతిపత్రాలు సమర్పించారు. కేంద్రం సానుకూలంగా స్పందించి ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేసింది. దీంతో ఆర్డీటీ సేవా కార్యక్రమాలను త్వరలోనే మళ్లీ ప్రారంభించనుంది.
ఆర్డీటీ విదేశీ నిధుల విషయంలో సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీటీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఎన్నో సేవలు అందిస్తోందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్డీటీకి విదేశాల నుంచి వస్తున్న నిధులు వినియోగించేందుకు అంతరాయం కలిగిందని.. ఆర్డీటీ అందిస్తున్న సేవల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించామన్నారు. ఆయన స్పందించి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి విన్నవించగానే సానుకూలంగా స్పందించిన కేంద్రానికి.. ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాది మంది పేద ప్రజల తరఫున చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
అనంతపురం ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి లోకేష్ అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. లక్షలాది మంది సంతోషించే సమాచారం. పేద ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాను. పేదల ఇళ్లలో వెలుగు, నిరుపేద పిల్లల చదువు, ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ గారికి, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాల సేవాస్ఫూర్తితో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు’ తెలుపుతూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.