New Districts In AP: ఏపీలో 26 జిల్లాలకు.. తుది నోటిఫికేషన్ విడుదల..!
- By HashtagU Desk Published Date - 09:15 AM, Sun - 3 April 22

ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు వచ్చేశాయ్. 13 జిల్లాల నవ్యాంధ్ర, ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారింది. ఈ క్రమంలో కిత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు పాలనపారంగా అందుబాటులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులో తెలిపింది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే విస్తీర్ణం దృష్ట్యా అరకును మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 26కు పెరగగా, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కు చేరింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న ప్రభుత్వం తొలి నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోకొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పు, కూర్పుతోపాటు పేర్లపై సుమారు 12 వేల 600 అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జగన్ ప్రభుత్వం స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది.
తిరుపతి మిగతా జిల్లాల పేర్లను ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొన్న వాటినే రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూ చేసింది. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు దీనిని తిరుపతి జిల్లాగానే ఉంచారు. మరోవైపు మన్యం జిల్లాకు బదులుగా పార్వతీపురం మన్యం అనే పేరు ఖరారు చేశారు. కొన్ని జిల్లాల పరిధిలోని మండలాల్లో కొన్ని సవరణలు జరిగాయి. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక కొత్త జిల్లాలను సోమవారం ఉదయం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి రేపు ఉదయం 9.45 గంటలకు ఈ కార్యక్రమం ముగిసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.