APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- Author : Vamsi Chowdary Korata
Date : 22-05-2026 - 3:22 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో కొత్తగా నిర్మించిన వసతి గదుల్ని ప్రారంభించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మరో 116 ఆలయాలకు విస్తరిస్తామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో ఈవో పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు దేవాదాశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఏపీపీఎస్సీ ద్వారా మొత్తం106 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆలయ ఉద్యోగుల వేతనాల మంజూరుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 980 ఆలయాలకు కొత్త పాలకమండళ్లను నియమించామని.. మరో 438 ఆలయాలకు త్వరలో నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 52 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ చేస్తున్నారని.. రాబోయే రోజుల్లో మరో 116 ఆలయాలకు విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీ భక్తులకు జారీ చేసే శ్రీవాణి టికెట్ల జారీలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదన్నారు ఆనం.. కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో తిరుమలతో పాటుగా ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నామని.. అక్రమాలకు తావు ఉండదన్నారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో భక్తుల కోసం నిర్మించిన వసతి గదుల్ని ప్రారంభించారు. మొత్తం రూ.16.5 కోట్లతో 108 వసతి గదులు నిర్మించగా మంత్రి ఆనం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవాణి భజన మందిరాల కార్యక్రమాన్ని టీటీడీ సహకారంతో అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే గిరిజన తండాలు, దళితవాడల్లో భజన మందిరాలను నిర్మిస్తామన్నారు. స్థానికులు కోరితే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. 691 ఆలయాలకు రూ.812.67 కోట్లతో కామన్ గుడ్ ఫండ్ కింద జీర్ణోద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన వసతి కల్పిస్తామన్నారు మంత్రి ఆనం. వినాయక సదన్లో రూ.14.74 కోట్లతో ఆధునాతన వసతులతో భక్తులకు వసతిని ప్రారంభించామన్నారు. ఫర్నిచర్ సహా ముఖ్యమైన సౌకర్యాల కోసం రూ.2.10 కోట్లు కేటాయించామన్నారు. వినాయక సదన్లోని ప్రతి గదిలో దేవుడి ఫోటో పెట్టడం మంచి నిర్ణయమన్నారు. కాణిపాకం పుష్కరిణిలో పనులు చేపడతామన్నారు. బస్టాండ్ నిర్మాణానికి రూ.16 కోట్లు, డోనర్ గెస్టు హౌస్కు రూ.4 కోట్లతో పనులు ప్రారంభమవుతాయన్నారు. అర్ధగిరి, మొగిలి ఆలయాలను టూరిజం హబ్గా.. పూతలట్టు నియోజకవర్గంలోని అరగొండ చౌడేశ్వరి ఆలయాన్ని దాతలు, దేవదాయశాఖ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.