వరికపూడిశెల ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Author : Vamsi Chowdary Korata
Date : 23-01-2026 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
Varikapudisela Irrigation Project ఆంధ్రప్రదేశ్లో కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పల్నాడు జిల్లాలో 84,500 ఎకరాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు రూ.3,227.15 కోట్లు ఖర్చవుతుంది. మరోవైపు, కడప, ప్రకాశం జిల్లాల్లో 800 మెగావాట్ల రాజుపాలెం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కూడా అనుమతులు లభించాయి. అన్నమయ్య జిల్లా వీరబల్లి ప్రాజెక్టు అనుమతులు మాత్రం ప్రస్తుతం నిలిపివేశారు.
- ఏపీలో మరో ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది
- వరికపూడిశెలకు పర్యావరణ అనుమతులు
- అనుమతులకు సిఫార్సు చేసిన కమిటీ
ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయ్యింది. పల్నాడు జిల్లాలో ప్లాన్ చేసిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. ఈనెల 9న జరిగిన సమావేశంలో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ చర్చించింది. ఈ మేరకు ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించిన కమిటీ.. అల్ప వర్షపాతం, వెనుకబాటుతనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత అనుమతులకు సిఫార్సు చేసింది. గత పదేళ్లుగా ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.. చివరికి అనుకున్నది సాధించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 84,500 ఎకరాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.3,227.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల 25 గ్రామాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 270 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించారు.. అడిగొప్పుల, ఆత్మకూరు, దరివేముల ప్రాంతాల్లో సేకరించనున్నారు. ఈ భూములి 19.13 హెక్టార్లు అటవీ భూమి ఉంది. 4.86 టీఎంసీల నీటిని వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని పొలాలకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకువరికపూడిశెల వాగు నుంచి ఎత్తిపోయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గ్రామస్థులు చేసిన విజ్ఞప్తి మేరకు.. మొదట 24,900 ఎకరాలకు పరిమితమైన ఈ ప్రాజెక్టు పరిధిని 84,500 ఎకరాలకు పెంచారు. దీని కోసం గతేడాది అక్టోబర్ 31న జీవో కూడా విడుదలైంది. ఈ ప్రాజెక్టు వల్ల పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది.
మరోవైపు మరో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకుకు కూడా అనుమతులకు లైన్ క్లియర్ చేశారు. కడప, ప్రకాశం జిల్లాల్లో ఏపీ జెన్కో, ఎన్హెచ్పీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కలిసి 334.8 హెక్టార్లలో తలపెట్టిన 800 మెగావాట్ల రాజుపాలెం క్లోజ్లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ప్లాన్ చేశాయి. ఈ ప్రాజెక్టుకు కూడా పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయ్యింది. మరోవైపు అన్నమయ్య జిల్లాలో 489.1 హెక్టార్లలో నిర్మించాలని ప్లాన్ చేసిన వీరబల్లి ప్రాజెక్టుకు (పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్) సంబంధించిన అనుమతులను ప్రస్తుతం నిలిపివేశారు.