విద్యాశాఖ సూపర్.. లోకేష్పై కేంద్ర బృందం ప్రశంసలు
- Author : Vamsi Chowdary Korata
Date : 17-03-2026 - 2:49 IST
Published By : Hashtagu Telugu Desk
AP Education Minister Nara Lokesh ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టిన కీలక సంస్కరణలను నేషనల్ సమగ్ర శిక్షా అభియాన్ – SSA బృందం ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు టెక్నాలజీ సాయంతో అందిస్తున్న బోధనా పద్ధతులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర బృందం కొనియాడింది.
లోకేష్ ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్కు పెద్దపీట వేస్తున్నారు. కేవలం భవనాల ఆధునీకరణకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేలా కరిక్యులమ్లో కీలక మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐటీ వినియోగాన్ని పెంచడం, గూగుల్ వంటి గ్లోబల్ సంస్థల భాగస్వామ్యంతో AI లెర్నింగ్ను ప్రవేశపెట్టడం వంటి చర్యలు విద్యాశాఖ రూపురేఖలను మార్చేశాయని SSA టీమ్ ప్రశంసించింది.
పాఠశాలల్లో మౌలిక వసతులు, ల్యాబ్స్ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న వేగాన్ని కేంద్ర బృందం ప్రత్యేకంగా అభినందించింది. టీచర్లకు నూతన బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ విజన్కు అనుగుణంగా స్కూల్ లెవెల్ నుంచే సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం విప్లవాత్మక పరిణామమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల వినియోగం, పారదర్శకత, అమలు తీరులో ఏపీ విద్యాశాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని నేషనల్ SSA టీమ్ స్పష్టం చేసింది. గతంలో ఉన్న సమస్యలను అధిగమిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాష్ట్రానికి గొప్ప మానవ వనరులను అందిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.