AP News: ఏపీలో ఎన్నికల హీట్..ఈసీ రివ్యూ
మరికొద్దీ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తుంది.
- Author : Praveen Aluthuru
Date : 24-12-2023 - 9:34 IST
Published By : Hashtagu Telugu Desk
AP News: మరికొద్దీ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతను ఎన్నికల సంఘం అధికారుల బృందం శనివారం సమీక్షించింది. ఓటర్ల జాబితాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ నేతృత్వంలోని ఈసీ బృందం శనివారం ముగిసిన రెండు రోజుల సమీక్షా సమావేశంలో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం అధికారులు జిల్లా అధికారులకు సూచించారని, పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ఓటర్ల జాబితాను పరిశీలించాలని, ఈ విషయంలో ఎలాంటి తప్పులు ఉండకూడదని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులకు సరైన శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లను ఈసీ అధికారులు ఆదేశించారు.
Also Read: CM Jagan: సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన 2వ రోజు