AP CM Jagan : మేం వెళ్తున్నాం.. మీరుకూడా రండి.. ఆ 19 పార్టీలను కోరిన సీఎం జగన్
పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, మోదీ ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్, దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ భవన ప్రారంభ కార్యక్రమానికి మేం రామంటూ కాంగ్రెస్తో సహా దేశంలోని 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి.
- Author : News Desk
Date : 25-05-2023 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ నెల 28న కొత్త పార్లమెంట్(New Parliament) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించనున్నారు. అయితే, రాజ్యాంగం ఇచ్చిన ప్రొటోకాల్ ప్రకారం.. పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, మోదీ ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్(Congress), దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ భవన ప్రారంభ కార్యక్రమానికి మేం రామంటూ కాంగ్రెస్తో సహా దేశంలోని 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటనను సైతం విడుదల చేశాయి. ఈ 19 ప్రతిపక్ష పార్టీలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభ కార్యక్రమానికి మేం వెళ్తున్నాం.. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి మీరుకూడా రావాలంటూ జగన్ కోరారు.
పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది. మనదేశ ఆత్మను ప్రతిబింబిస్తుందని జగన్(CM Jagan) అన్నారు. ఈ భవనం దేశ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినదని, ఇలాంటి భవనం ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరించాలని అనుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని జగన్ చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోదీకి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంపై ఉన్న నిజమైన స్ఫూర్తితో తమ పార్టీ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొంటుందని, ఈ క్రమంలోనే అన్ని పార్టీలు రాజకీయ విభేదాలు పక్కనపెట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జగన్ కోరారు.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ నుంచి అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీలు హాజరుకానున్నాయి. ఈ మేరకు ఆ పార్టీల అధినేతలు ప్రకటించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ కార్యక్రమానికి పార్టీ హాజరుకాదని బీఆర్ఎస్ సీనియర్ నేత జాతీయ మీడియాకు వెల్లడించారు. అయితే, పార్టీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి కానీ, లోకసభ స్పీకర్ కానీ ప్రారంభిస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిని ఈ కార్యక్రమానికి పంపవచ్చని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాల బట్టి చూస్తుంటే నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంకు బీఆర్ఎస్ పార్టీ కూడా దూరంగా ఉంటుందని తెలుస్తుంది.
Also Read : CM Jagan : గ్రూప్- 1, 2 నోటిఫికేషన్లకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్ .. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే..?