ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.
- Author : Latha Suma
Date : 24-02-2026 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తిరుమల లడ్డూ వ్యవహారంపై నిర్వహించిన చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. ‘మహాపాపం’ పేరుతో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లడ్డూ కల్తీ తీరును వివరించారు. రాజకీయ వివాదాలకు తావు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు సూచన మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక పంపిందని, దాని ఆధారంగా ఏకసభ్య కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి … రూ.231 కోట్ల అక్రమాలు
2019 నుంచి 2024 మధ్య కాలంలో 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారని సీఎం తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.231.51 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సడలించారని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం లాలూచీతో లూటీ జరిగినట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినప్పటికీ సంబంధిత నివేదికను దాచిపెట్టారని ఆరోపించారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తాను స్వయంగా చెప్పలేదని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే వ్యాఖ్యానించానని స్పష్టం చేశారు. “ఆ భగవంతుడే నాతో చెప్పించాడు” అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
నిబంధనల సడలింపు … షెల్ కంపెనీల పాత్రపై ఆరోపణలు
ఈ వ్యవహారం టీటీడీ ఈవో, ఛైర్మన్కు తెలియకుండా జరుగుతుందా? అని సీఎం ప్రశ్నించారు. వారి అనుకూలంగా నిబంధనలను సడలించారని విమర్శించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారని, నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించారని తెలిపారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీని ఎనిమిది టన్నులకు కుదించారని చెప్పారు. డెయిరీల వార్షిక టర్నోవర్ అర్హతను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారని, సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్లకు మినహాయింపులు ఇచ్చారని ఆరోపించారు. పోమిల్ జైన్, విపిన్ జైన్, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని పేర్కొన్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్, శ్రీవైష్ణవి డెయిరీ, మాల్ గంగా మిల్క్ డెయిరీ వంటి షెల్ కంపెనీలు సహకరించాయని తెలిపారు. ల్యాబ్ నివేదికల ఫోర్జరీ జరిగిందని, తప్పుడు రిటర్నులతో మోసం చేశారని ఆరోపించారు. కల్తీ నెయ్యి సరఫరాదారులకు కొందరు అధికారులు సహకరించారని అన్నారు. ప్రసాదం తీసుకున్న భక్తులందరూ నాణ్యత తగ్గిందని చెప్పారని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ వంటి పవిత్ర ప్రసాదంపై జరిగిన ఈ వ్యవహారం అత్యంత గంభీరమైందని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు.