సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఇకపై ఆ అధికారులకే ప్రోత్సాహకాలు!
చివరగా, ప్రజా ప్రతినిధులైనా, అధికారులైనా వారి పనితీరు ఆధారంగానే అంచనా వేయాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు.
- Author : Gopi
Date : 06-04-2026 - 3:19 IST
Published By : Hashtagu Telugu Desk
CM Chandrababu: అనంతపురం జిల్లా తాడిపత్రి/యాడికి ప్రాంతంలో జరిగిన ‘జలధార’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని, పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన పనుల ప్రోగ్రెస్ రిపోర్టును ఆయన ప్రజల ముందు ఉంచారు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును స్వయంగా సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు.
సభలో సీఎం చంద్రబాబు అత్యంత కఠినంగా, అదే సమయంలో ప్రజాహితంగా వ్యవహరించారు. సరిగ్గా పనితీరు కనబరచని అధికారులను వేదికపైకి పిలిచి వివరణ కోరారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యమయ్యాయో వివరిస్తూ, ప్రస్తుత పాలనలో మార్పు రావాలని దిశానిర్దేశం చేశారు. బాగా పనిచేస్తున్న అధికారులను అభినందిస్తూ ప్రజలతో చప్పట్లు కొట్టించడం విశేషం. అధికారుల పనితీరును ఇకపై ‘సూపర్ అచీవర్స్, అచీవర్స్, పెర్ఫార్మర్స్, లెర్నర్స్’గా విభజించి, వారి ప్రతిభ ఆధారంగానే ప్రోత్సాహకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!
ముఖ్యంగా ప్రజా సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలని, భూవివాదాలు లేకుండా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఉచిత ఇసుక విధానంపై ప్రజల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇసుక తరలింపులో ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదాయం తగ్గినా సరే, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉచిత ఇసుకను అమలు చేస్తున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.
చివరగా, ప్రజా ప్రతినిధులైనా, అధికారులైనా వారి పనితీరు ఆధారంగానే అంచనా వేయాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు. అధికారులు, ఉద్యోగులు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరుతూ, భవిష్యత్తులో తాను పాల్గొనే ప్రతి సభకు జిల్లా యంత్రాంగం మొత్తం హాజరు కావాలని ఆదేశించారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఆయన సాగించిన ఈ సమీక్షా సమావేశం, అధికారుల్లో బాధ్యతను, ప్రజల్లో ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకాన్ని పెంచేలా సాగింది.