Anganwadi Protest: అంగన్వాడీల తొలగింపుపై చంద్రబాబు ఫైర్
అంగన్వాడీలకు జగన్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత మరియు ఇతర డిమాండ్లతో ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోగా సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
- Author : Vamsi Chowdary Korata
Date : 22-01-2024 - 2:59 IST
Published By : Hashtagu Telugu Desk
Anganwadi Protest: అంగన్వాడీలకు జగన్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత మరియు ఇతర డిమాండ్లతో ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోగా సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదివరకే వారందరికీ ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారు విధుల్లో చేరకపోవడంపై అంగన్వాడీలను తొలగించాలంటూ ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. అంతకుముందు అంగన్వాడీలతో ప్రభుత్వం పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగిస్తామంటూ అంగన్వాడీలు పట్టుబట్టారు.
అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత మండిపడ్డారు. జగన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలపై రోడ్డెక్కిన అంగన్వాడీలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. సమస్యలపై పోరాడితే అణచివేస్తున్నారని, అయితే దానికి వెచ్చించిన సమయాన్ని సమస్య పరిష్కారంపై పెడితే ఫలితం ఉంటుందని ప్రభుత్వానికి చురకలంటించారు చంద్రబాబు.
సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించిన నేపథ్యంలో తీసేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. ఈ నెల 25న కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష 06 వేల మంది అంగన్వాడీలు ఉండగా.. వీరిలో కేవలం 10 శాతం మంది మాత్రమే విధుల్లో చేరినట్టు ఉద్యమ నేతలు పేర్కొన్నారు.
Also Read: Ayodhya : అయోధ్యలో చిరు, పవన్, చంద్రబాబు, రాంచరణ్ సందడి