రెస్టారెంట్లతో తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 11-02-2026 - 3:42 IST
Published By : Hashtagu Telugu Desk
Food Safety Officers Inspection గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రోజున పది బృందాలుగా ఏర్పడి గుంటూరులోని పలు ప్రాంతాలలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సమయంలో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చేస్తున్న నిర్వాకాలు బయటపడ్డాయి. ఓ రెస్టారెంట్లో చికెన్, మటన్ను వారం రోజులుుగా ఫ్రిజ్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఆహారాన్ని తింటే డయేరియా బారిన పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం, నాణ్యత లేని పదార్థాలు అందిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ మధ్యకాలంలో సొంతింటి ఆహారం తినేవారి కన్నా, హోటల్స్, రెస్టారెంట్ ఫుడ్ తినేవారు ఎక్కువయ్యారు. ఇంటి భోజనం అందుబాటులో లేకపోవటం, వంట రాకపోవటంతో పాటు వివిధ పరిస్థితుల కారణంగా బయటి ఆహారం వైపు మొగ్గు చూడాల్సిన పరిస్థితి. నేరుగా హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లేవారు కొందరైతే.. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే లాగించేవాళ్లు మరికొందరు. అయితే మీరు తినే ఆహారం ఎంతవరకూ నాణ్యమైనదీ, ఎంత వరకూ సురక్షితమైనదని అనుకుంటున్నారని అడిగితే.. కచ్చితంగా అవును అని సమాధానం ఇచ్చేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏదైనా హాటల్స్, రెస్టారెంట్లకు మీరు వెళ్లినప్పుడు అక్కడి ఆహార పదార్థాల నాణ్యత సరిగా లేదని మీకు అనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం రోజున పలు హోటల్స్, రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేశారు. రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, బేకరీలలో తూనికలు-కొలతల శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు జరిపారు. పది టీములుగా ఏర్పడి అరండల్ పేట, బ్రాడీపేట, లాలాపేట, కింగ్స్ హోటల్ సెంటర్, బృందావన్ గార్డెన్స్ సెంటర్, లక్ష్మీపురం, నగరాలు ప్రాంతాలలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే లక్ష్మీపురంలో ఓ రెస్టారెంట్లో 60 కిలోల చికెన్, మటన్లను రెస్టారెంట్ నిర్వాహకులు వారం రోజులుగా ఫ్రిజ్లో నిల్వచేసినట్లు అధికారులు గుర్తించారు.
ఒక స్వీట్ షాపులో పూర్ణాల పిండిని కూడా భారీ మొత్తంలో ఫ్రిజ్లో దాచిన విషయాన్ని గుర్తించారు. మాంసాహారాన్ని ఇలా ఫ్రిజ్లో ఎక్కువ కాలం నిల్వచేయటం వల్ల ఫంగస్ వ్యాపిస్తుందని.. ఈ ఆహారాన్ని తిన్నవారు డయేరియాకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నవారికి నోటీసులు జారీ చేశారు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో కొంతమంది రెస్టారెంట్ల నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు.
మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకుని.. పలువురు నిర్వాహకులు తమ హోటల్స్, రెస్టారెంట్లను మూసేశారు.హోటల్స్, రెస్టారెంట్ల నుంచి శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపించారు. రిపోర్టులు వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ, నాణ్యత లేని ఆహారాన్ని విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. 94403 79755 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.