బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్
- Author : Vamsi Chowdary Korata
Date : 12-02-2026 - 3:33 IST
Published By : Hashtagu Telugu Desk
Acham Naidu Vs Botsa Satyanarayana వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయిన వైసీపీ నేతలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తుంటే బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
పరిశ్రమలకు భూములే ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్ గణాంకాలతో సహా సమాధానం ఇస్తుంటే, వినే ఓపిక లేక వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మన దేశానికి వస్తున్న ప్రతి వంద రూపాయల పెట్టుబడిలో 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని, ఇదే తమ కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమల స్థాపన అత్యవసరమని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే, భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన వైసీపీ నేతలను హెచ్చరించారు.