Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు
- Author : Vamsi Chowdary Korata
Date : 28-03-2026 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
Nallapareddy Prasanna Kumar Reddy రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎక్కడో గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ సభ్యురాలు, నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిఫార్సుతో ఈ నిధులు మంజూరు కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
వివరాల్లోకి వెళితే.. కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు అరకు వైసీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజా రాణి స్పందించారు. తన ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల (MPLADS) నుంచి రూ.10 లక్షలను కోవూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశారు. ఈ విషయాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి నిధులు కేటాయించిన ఎంపీ తనుజా రాణికి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మంజూరైన నిధుల ద్వారా కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, విడవలూరు మండలం చౌకచర్ల ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్డుకు రూ.3 లక్షలు, అదే మండలంలోని దంపూరు ఎస్సీ కాలనీలో సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.2 లక్షలు కేటాయించినట్లు ప్రసన్నకుమార్ రెడ్డి వివరించారు.
ప్రస్తుతం కోవూరు నియోజకవర్గానికి టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండగా, ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సిఫార్సుతో మరో ప్రాంతం నుంచి ఎంపీ నిధులు కేటాయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకునేందుకు ప్రసన్నకుమార్ రెడ్డి ఈ విధంగా పావులు కదుపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణంగా ఎంపీల్యాడ్స్ కింద లోక్సభ సభ్యులు తమ సొంత నియోజకవర్గంలోనే నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇతర నియోజకవర్గాలకు నిధులు కేటాయించేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. ఒక లోక్సభ ఎంపీ తన నియోజకవర్గం కాని, రాష్ట్రంలోని మరో సుదూర ప్రాంతానికి నిధులు ఇవ్వడం, అది కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఈ విషయం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.