ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!
ఒకవేళ సర్వేలో ఒక కుటుంబం అనర్హులుగా తేలితే, 2026-27 విద్యా సంవత్సరం నుండి వారు 'తల్లికి వందనం' వంటి ప్రయోజనాలను కోల్పోతారు. ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉండి రూ. 45,000 పొందుతున్న తల్లి, అనర్హురాలిగా తేలితే ఆ మొత్తం ఆగిపోతుంది.
- Author : Gopichand
Date : 23-12-2025 - 8:49 IST
Published By : Hashtagu Telugu Desk
Unified Family Survey: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 12 వరకు ఈ సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరిస్తారు. పౌరులందరికీ సంబంధించిన పూర్తి స్థాయి కేంద్రీకృత డేటాబేస్ను రూపొందించడమే ఈ సర్వే లక్ష్యం. దీని కోసం ప్రత్యేకంగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యాప్’ను రూపొందించారు. ఫీల్డ్ స్టాఫ్ ఈ క్రింది వివరాలను నమోదు చేస్తారు.
- కుటుంబ సభ్యుల పేర్లు, మొబైల్ నంబర్లు, ఆధార్, పాన్ వివరాలు.
- విద్య, ఉపాధి స్థితి, ఆదాయ స్థాయి.
- ఆస్తులు, వాహనాలు, నివాస గృహ సమాచారం.
- సామాజిక వర్గం, వ్యవసాయ భూమి వివరాలు.
Also Read: ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!
e-KYC తప్పనిసరి
- డేటా సేకరించిన తర్వాత ప్రతి వ్యక్తి వేలిముద్రల ద్వారా e-KYC పూర్తి చేయడం తప్పనిసరి.
- e-KYC పూర్తి చేసిన వారు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉంటారు.
- ఎవరైతే దీనిని పూర్తి చేయరో వారిని అందుబాటులో లేనివారుగా పరిగణిస్తారు. ఫలితంగా ‘తల్లికి వందనం’ వంటి పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
అర్హత నిబంధనలు, వడపోత
సర్వే ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించి, కుటుంబాలను ఆర్థిక స్థితిగతుల ఆధారంగా వర్గీకరిస్తారు. కార్లు ఉండటం, ఇన్కమ్ టాక్స్ కట్టడం, భూమి విస్తీర్ణం వంటి అంశాల ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. రేషన్, పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పీఎం-కిసాన్ మరియు ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలను కేవలం నిజమైన అర్హులకే పరిమితం చేస్తారు. గత ప్రభుత్వం అనర్హులకు కూడా ప్రయోజనాలు కల్పించిందని, ఆ అవకతవకలను సరిదిద్దడానికే ఈ సర్వే అని అధికారులు చెబుతున్నారు.
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్
సర్వే పూర్తయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వం ఒక స్మార్ట్ కార్డ్ను జారీ చేస్తుంది. రేషన్, పెన్షన్, ఆరోగ్య బీమా వంటి అన్ని సేవలను ఈ సింగిల్ డిజిటల్ సిస్టమ్లో విలీనం చేస్తారు. దీనివల్ల డూప్లికేట్ కార్డులు తొలగిపోయి, పారదర్శకత పెరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డులను ఫిబ్రవరి నుండి జారీ చేసే అవకాశం ఉంది.
ఒకవేళ సర్వేలో ఒక కుటుంబం అనర్హులుగా తేలితే, 2026-27 విద్యా సంవత్సరం నుండి వారు ‘తల్లికి వందనం’ వంటి ప్రయోజనాలను కోల్పోతారు. ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉండి రూ. 45,000 పొందుతున్న తల్లి, అనర్హురాలిగా తేలితే ఆ మొత్తం ఆగిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొని e-KYC పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతోంది.