AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు
- Author : Vamsi Chowdary Korata
Date : 26-03-2026 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
Ayyanna Patrudu అమరావతి రాజధాని విషయంలో ఐదేళ్లుగా సాగుతున్న అస్పష్టతకు, రాజకీయ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, దీనికి కేంద్ర చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మార్చి 28న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ఏపీ సచివాలయంలో స్పీకర్ మాట్లాడుతూ… రాజధాని విషయంలో ఇప్పటివరకు ఉన్న ‘లీగల్ గ్యాప్’ను భర్తీ చేయడమే ఈ స్పెషల్ సెషన్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధాని అని సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ వెంటనే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు జరగనున్న నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ పంపే ఈ తీర్మానాన్ని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయిస్తామని వెల్లడించారు.
ఈ ప్రక్రియ గనుక పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చడం లేదా మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించడం సాధ్యం కాదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్లో ప్రత్యేక సమావేశం జరుగుతుందని స్పీకర్ తెలిపారు.