Chandrababu In Naravaripalle : బుధవారం వరకు నారావారిపల్లెలోనే చంద్రబాబు.. భోగి శుభాకాంక్షలు చెప్పిన సీఎం
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శనివారం రోజే నారావారిపల్లెకు(Chandrababu In Naravaripalle) చేరుకున్నారు.
- Author : Pasha
Date : 13-01-2025 - 8:46 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu In Naravaripalle : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఉన్నారు. ఆయన ఇవాళ, రేపు ఇక్కడే ఉండనున్నారు. కుటుంబీకులు, స్థానికులతో కలిసి సంక్రాంతి పండుగ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇవాళ నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మంగళవారం కూడా అక్కడే ఉంటారు. బుధవారం మధ్యాహ్నం అమరావతికి చంద్రబాబు తిరుగు పయనం అవుతారు.
Also Read :GOVT Star Hotel : రూ.582 కోట్లతో హైదరాబాద్లో ప్రభుత్వ ఫైవ్ స్టార్ హోటల్.. ఎందుకో తెలుసా ?
చంద్రగిరిలో బాలయ్య సినిమా చూసిన లోకేశ్, బ్రాహ్మణి
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శనివారం రోజే నారావారిపల్లెకు(Chandrababu In Naravaripalle) చేరుకున్నారు. లోకేశ్ తన సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్తో కలిసి ఆదివారం రోజు ఇక్కడకు వచ్చారు. ఆదివారం సాయంత్రం తల్లి,భార్యాబిడ్డలతో కలిసి నారావారిపల్లె సమీపంలోని శేషాపురం వెళ్లి శేషాచల లింగేశ్వర ఆలయాన్ని లోకేశ్ సందర్శించి పూజలు చేశారు. అక్కడి నుంచి కందులవారిపల్లికి వెళ్లి వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు. ఆ గ్రామంలో ఉన్న చంద్రబాబు సోదరి హైమావతి ఇంటికి లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి వెళ్లారు. ఆదివారం రాత్రి చంద్రగిరి పట్టణంలోని ఎస్వీ థియేటర్కు మంత్రి నారా లోకేశ్, సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాంశ్, నందమూరి కుటుంబ సభ్యులు వెళ్లారు. వారంతా కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహరాజ్’ సినిమాను వీక్షించారు.
Also Read :Makar Sankranti : ఈ 5 దక్షిణ భారతీయ వంటకాలతో పొంగల్ను జరుపుకోండి..! పండుగ మజా రెట్టింపు అవుతుంది..!
చంద్రబాబు ట్వీట్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ఇవాళ తెల్లవారుజామున ఓ ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. పవిత్రమైన భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలు తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికీ మరొక మారు భోగి పండుగ శుభాకాంక్షలు’’ అని చంద్రబాబు రాసుకొచ్చారు.
రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని… pic.twitter.com/2mEwSKe4c0
— N Chandrababu Naidu (@ncbn) January 13, 2025