Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం
- By Vamsi Chowdary Korata Published Date - 11:37 AM, Thu - 4 December 25
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి హైదరాబాద్ భక్తులు 50 కిలోల వెండితో అద్భుతమైన పానవట్టాన్ని కానుకగా ఇచ్చారు. కోటి రూపాయల విలువైన ఈ పానవట్టం ఆలయానికి కొత్త శోభను తెస్తుంది. భక్తులు ఆలయంలో అన్నప్రసాద వితరణకు కూడా విరాళాలు అందిస్తారు. వివాహాలు ఆలస్యమైనా, సంతానం లేకున్నా మోపిదేవిని దర్శిస్తే తప్పక కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నాగదోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి.
కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తుడు ఖరీదైన కానుకను అందజేశారు. హైదరాబాద్కు చెందిన రావి వీరరాఘవ చౌదరి, సౌభాగ్యలక్ష్మి దంపతులు 50 కిలోల వెండితో తయారు చేయించిన పానవట్టాన్ని విరాళంగా అందించారు. ఈ పానవట్టం ప్రత్యేకత ఏమిటంటే.. మండపం కూడా ఉంది. ఈ అద్భుతమైన కానుకను గురువారం ఉదయం పూజల అనంతరం ఆలయంలో అలంకరించనున్నారు. ఈ పానవట్టం తయారీకి సుమారు కోటి రూపాయలు ఖర్చయినట్లు దాతల ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లోని నిపుణులైన కళాకారులు ఈ పానవట్టాన్ని ఎంతో శ్రద్ధతో, కళాత్మకంగా తీర్చిదిద్దారు. 50 కిలోల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించి, దీనిని తయారు చేశారు. ఈ పానవట్టం ఆలయానికే ప్రత్యేక శోభను తీసుకురానుంది. ఈ సందర్భంగా దాతల్ని ఆలయ అధికారులు అభినందించారు.
కృష్ణా నది ఒడ్డున ఉన్న మోపిదేవి పుణ్యక్షేత్రం వెలసింది. వివాహాలు ఆలస్యమవుతున్నవారు మోపిదేవిని దర్శిస్తే తప్పకుండా వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే, సంతానం లేని దంపతులు ఈ పవిత్ర స్థలంలో ఒక రాత్రి గడిపితే వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. మోపిదేవి ఆలయంలోని శివలింగం ప్రత్యేకత ఏమిటంటే, అది పాముచుట్టలపైనే ప్రతిష్ఠించబడి ఉంటుంది. అభిషేకం, అర్చన చేసే సమయంలో పాలు పోయడానికి పానవట్టం కింద ఒక రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంలోనే పాలు పోస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మోహినీపురం అని పిలిచేవారు. కాలక్రమేణా, ఈ పేరు మోపిదేవిగా మారిందని స్థానిక కథనం. ఈ ఆలయం కృష్ణా నది తీరంలో ఉండటం వల్ల దీనికి మరింత ప్రాశస్త్యం చేకూరింది.
మోపిదేవి సుబ్రహ్మణ్యుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దృష్టి, వినికిడి లోపాలు, శారీరక బలహీనతలు, చర్మ వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ అభిషేకం, అర్చన పూజలు చేయించుకుంటే ఉపశమనం పొందుతారని నమ్మకం. అంతేకాకుండా, విద్య, ఐశ్వర్య వృద్ధి కూడా కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా, ఈ ఆలయంలో నాగదోష పరిహార పూజలు వివాహాలు ఆలస్యమయ్యేవారికి, సంతానం లేని దంపతులకు మేలు చేస్తాయని ప్రసిద్ధి. ఈ ఆలయంలో నాగదోష పరిహార పూజలు జరిపించుకుంటే వివాహాలు ఆలస్యమయ్యేవారికి త్వరగా వివాహం జరుగుతుందని, సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని ముఖ్య విశేషం. నాగదోషం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నవారు మోపిదేవి ఆలయంలో నమ్మకంతో పూజలు చేయించుకుంటే దోషం తొలగిపోతుందని భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ ఆలయానికి భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిత్యం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు మోపిదేవి ఆలయానికి భారీగా తరలి వస్తుంటారు.