మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. ఎల్పీజీపైనే ఎందుకు ఎఫెక్ట్ పడింది?
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభమైన తర్వాత దేశంలో గ్యాస్ కనెక్షన్లు 14 కోట్ల నుండి 33 కోట్లకు పైగా పెరిగాయి. ప్రస్తుతం కోట్లాది ఇళ్లు వంట కోసం పూర్తిగా ఎల్పిజిపైనే ఆధారపడుతున్నాయి.
- Author : Gopichand
Date : 15-03-2026 - 5:10 IST
Published By : Hashtagu Telugu Desk
LPG Crisis: మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న పోరాటం కారణంగా భారత ఎల్పిజి సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన మార్గం అయిన ‘హోర్ముజ్ జలసంధి’ని దిగ్బంధించాయి. భారత్ తన అవసరాలకు కావాల్సిన ఎల్పిజిలో సగానికి పైగా సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ వంటి గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. భారత్కు వచ్చే ఎల్పిజి షిప్మెంట్లలో దాదాపు 80 నుండి 90 శాతం ఈ సముద్ర మార్గం గుండానే వస్తాయి. అందుకే ఈ మార్గంలో చిన్నపాటి అలజడి రేగినా, భారత వంటగదుల్లో గ్యాస్ కొరత మొదటగా కనిపిస్తుంది.
పెట్రోల్, డీజిల్ పై ప్రభావం ఎందుకు పడలేదు?
ఎల్పిజి కొరత ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణంగా ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం భారత్ తన ముడి చమురు (Crude Oil) సేకరణను వివిధ దేశాలకు విస్తరించడమే. ప్రస్తుతం భారత్ 40 కంటే ఎక్కువ దేశాల నుండి చమురు కొనుగోలు చేస్తోంది. ఇటీవల కాలంలో రష్యా మనకు అతిపెద్ద సరఫరాదారుగా మారింది. కేంద్ర పెట్రోలియం మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 70 శాతం ఇప్పుడు హోర్ముజ్ జలసంధి పరిధిలోకి రాని మార్గాల ద్వారా వస్తోంది. అంతేకాకుండా భారత్కు ఉన్న అదనపు రిఫైనరీ సామర్థ్యం కూడా సంక్షోభ సమయాల్లో ఎంతగానో ఉపయోగపడుతోంది.
Also Read: సంతోషం అనేది కేవలం మనసుకి సంబంధించిన విషయమే కాదంట!
ఎల్పిజి ఇబ్బందులకు అసలు కారణం ఏమిటి?
ముడి చమురును నిల్వ చేయడానికి భారత్ వద్ద భూగర్భంలో భారీ వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. విశాఖపట్నం, మంగళూరు వంటి నగరాల్లో ఉన్న ఈ నిల్వలు పెట్రోల్-డీజిల్ కొరత రాకుండా కొన్ని వారాల పాటు రక్షణనిస్తాయి. కానీ ఎల్పిజి విషయంలో భారత్ వద్ద నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. భారత గ్యాస్ నిల్వ సామర్థ్యం రెండు రోజుల వినియోగం కంటే తక్కువగా ఉంది. దీనివల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరిగినా వెంటనే కొరత మొదలవుతుంది. మన గ్యాస్ వ్యవస్థ ‘నిరంతర ప్రవాహం’ కోసం రూపొందించబడింది తప్ప, భారీ స్టాక్ను నిల్వ చేయడానికి కాదు.
ఉజ్వల యోజన, పెరుగుతున్న డిమాండ్ ఒత్తిడి
గత దశాబ్ద కాలంలో భారత్లో ఎల్పిజి కనెక్షన్ల సంఖ్య భారీగా పెరగడం వల్ల డిమాండ్ ఒత్తిడి కూడా పెరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభమైన తర్వాత దేశంలో గ్యాస్ కనెక్షన్లు 14 కోట్ల నుండి 33 కోట్లకు పైగా పెరిగాయి. ప్రస్తుతం కోట్లాది ఇళ్లు వంట కోసం పూర్తిగా ఎల్పిజిపైనే ఆధారపడుతున్నాయి. కట్టెలు లేదా బొగ్గు వాడకం దాదాపు నిలిచిపోయింది. గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల అమ్మకాలను నిలిపివేస్తోంది. అదే సమయంలో వంట గ్యాస్ సరఫరా నిరంతరం కొనసాగేలా చూడటానికి అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుండి గ్యాస్ను తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.