భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా అసంతృప్తి
రష్యాపై ఆంక్షలు విధిస్తూ ఒక వైపు రాజకీయంగా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న యూరోపియన్ దేశాలు మరోవైపు అదే రష్యన్ చమురుతో తయారైన ఉత్పత్తులను వినియోగిస్తున్నాయన్న అంశాన్ని బెసెంట్ ఎత్తిచూపారు.
- Author : Latha Suma
Date : 28-01-2026 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
. రష్యన్ చమురు మార్గం..యూరప్కే తిరిగి ఎగుమతి?
. ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ పాత్ర మరియు టారిఫ్లపై సంకేతాలు
. భారత్పై అమెరికా విధించిన టారిఫ్లు సగానికి తగ్గే అవకాశం
Scott Bessent: భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) దాదాపు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై అమెరికా 25 శాతం టారిఫ్లు విధించిందని గుర్తు చేసిన ఆయన ఆ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అమెరికా చర్యల తర్వాత కూడా యూరోపియన్ దేశాలు భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హమని తెలిపారు. ఇది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బెసెంట్ చేసిన వ్యాఖ్యల్లో కీలక అంశం రష్యన్ చమురు ప్రయాణ మార్గమే. రష్యా నుంచి చమురు ముందుగా భారత్కు వస్తోందని, అక్కడ శుద్ధి చేసిన అనంతరం ఆ ఉత్పత్తులను యూరోపియన్ దేశాలే కొనుగోలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విధంగా చూస్తే ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధానికి యూరోపే పరోక్షంగా నిధులు సమకూర్చుకుంటోందన్న విమర్శను ఆయన సంధించారు. రష్యాపై ఆంక్షలు విధిస్తూ ఒక వైపు రాజకీయంగా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న యూరోపియన్ దేశాలు మరోవైపు అదే రష్యన్ చమురుతో తయారైన ఉత్పత్తులను వినియోగిస్తున్నాయన్న అంశాన్ని బెసెంట్ ఎత్తిచూపారు. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ద్వంద్వ వైఖరి ఉదాహరణగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో పరిష్కారం సాధ్యమవుతుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఈ విషయంలో యూరోప్ దేశాల కంటే అమెరికానే ఎక్కువ త్యాగాలు చేసిందని చెప్పారు. అయితే ఆ త్యాగాలు ఏవో మాత్రం వివరించకుండా వదిలేశారు. ఇదిలా ఉండగా భారత్పై విధించిన టారిఫ్ల విషయంలో తాజాగా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించిందని చెబుతూ దానిని అమెరికా పెద్ద విజయంగా అభివర్ణించారు. ప్రస్తుతం చమురు అంశంలో టారిఫ్లు అమల్లో ఉన్నప్పటికీ వాటిని సగానికి తగ్గించే లేదా పూర్తిగా తొలగించే అవకాశాలపై చర్చకు తావుందని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. భారత్–ఈయూ ఎఫ్టీఏ ఒప్పందం ప్రపంచ వాణిజ్య సమీకరణాల్లో కీలక మలుపుగా మారుతున్న సమయంలో అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై కొత్త వాదనలు ప్రతివాదాలకు దారి తీస్తున్నాయి. భారత్ పాత్ర యూరోప్ వైఖరి అమెరికా విధానాలు ఈ మూడు కలయికలో గ్లోబల్ రాజకీయాలు మరింత ఆసక్తికర దశకు చేరుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.