భారత్కు మరో సారి ట్రంప్ గుడ్న్యూస్.. అదనపు టారిఫ్ లను 25 % నుంచి 18% శాతానికి తగ్గింపు
- Author : Vamsi Chowdary Korata
Date : 07-02-2026 - 11:25 IST
Published By : Hashtagu Telugu Desk
Trade Deal అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్ పై విధించిన ప్రతీకార సుంకాల (25 శాతం) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్ లను తగ్గిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా, భారత్ ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్ లో భాగంగా 7 శాతం టారిఫ్ లను ట్రంప్ తగ్గించిన విషయం తెలిసిందే. తాజా ప్రకటనతో భారత్ పై అమెరికా పన్నుల భారం 18 శాతానికి తగ్గింది.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై ట్రంప్ అప్పట్లో ప్రతీకార సుంకాలు విధించారు. ఆయా దేశాల నుంచి అగ్రరాజ్యానికి దిగుమతి అయ్యే వస్తుసేవలపై 25 శాతం పన్నులు విధించి అమలు చేశారు. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. దీనికితోడు భారత్ పై అదనపు సుంకాలు మరో 25 శాతం విధించారు.
మొత్తంగా 50 శాతం టారిఫ్ లు విధించడంతో భారత ఎగుమతిదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇటీవల కుదరిన ట్రేడ్ డీల్ తర్వాత అదనపు సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి ట్రంప్ తగ్గించారు. దీంతో భారత్ పై ప్రతీకార సుంకాలు 25 శాతం, అదనపు సుంకాలను 18 శాతం అమెరికా అధికారులు వసూలు చేశారు. ట్రంప్ తాజా ప్రకటనతో ఇకపై భారత వస్తుసేవల మీద కేవలం 18 శాతం పన్నులు మాత్రమే వసూలు చేయనున్నారు.