Gaza : గాజా పూర్తిగా ఇజ్రాయిల్ హస్తగతమైపోతుందా ?
అక్టోబర్ ఏడో తేదీన గాజాను పాలిస్తున్న హమాస్ ఇజ్రాయిల్ పై ఆకస్మిక దాడి జరిపి ఎంతో మంది ఇజ్రాయీల ప్రాణాలు బలికొన్న మరుక్షణమే మరో యుద్ధం మొదలైంది
- By Sudheer Published Date - 10:15 PM, Fri - 13 October 23
డా. ప్రసాదమూర్తి
365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 23 లక్షల జనాభా. పొడవు కేవలం నలభై కిలోమీటర్లు. మూడు వైపుల నుండి ఇజ్రాయిల్ (Israel) దిగ్బంధం. మరోవైపు దారులు మూసేసిన ఈజిప్టు. ఎటూ పారిపోలేని నిస్సహాయ స్థితిలో గాజా (Gaza). క్షణక్షణం ప్రపంచాన్ని ముంచెత్తుతున్న మరణ వార్తలు, దీనుల ఆక్రందనలు,అసహాయ పసిపిల్లల రోదనలు అందరి హృదయాలను కలిసివేస్తున్నాయి. యుద్ధం (War) ఎప్పటికీ యుద్ధానికి పరిష్కారం కాదు. శాంతి, సామరస్యపూర్వక చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు, అటూ ఇటూ జీవితాలు సాగిస్తున్న సామాన్యుల భవిష్యత్తుకు భరోసా.. ఇవే ఎప్పటికైనా ప్రపంచానికి మార్గ నిర్దేశకాలు. దశాబ్దాల అణచివేత, ఆక్రమణ, రక్తోన్మాద హింసాయుత చర్యలు.. పాలస్తీనా ప్రజలను ఉగ్రవాదులుగా మార్చిన చారిత్రక నేపథ్యం ఎవరూ మర్చిపోలేనిది. ఎవరూ చెరిపేయలేనిది. అక్టోబర్ ఏడో తేదీన గాజాను పాలిస్తున్న హమాస్ ఇజ్రాయిల్ పై ఆకస్మిక దాడి జరిపి ఎంతో మంది ఇజ్రాయీల ప్రాణాలు బలికొన్న మరుక్షణమే మరో యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ మనం ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం అని దేశ ప్రజలకు చెప్పడమే కాదు, గాజుపై యుద్ధాన్ని ప్రారంభించారు కూడా. గాజాను పాలిస్తున్న హమాస్ ఉగ్రవాద నాయకులు తమ దాడికి కారణాలు ఎన్నో చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పాలస్తీనాలో నిరంతరం పెరిగిపోతున్న ఇజ్రాయిల్ సెటిల్మెంట్లు అలా ఉంచితే, తమ పుణ్యస్థలమైన అల్ అక్సా మసీదును ఇజ్రాయిల్ ధ్వంసం చేసిందని దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ పై దాడి చేశామని వారు చెప్తున్నారు. ఎవరు ఏ కారణాలతో మరొక దేశం పై ఎలాంటి దాడులు చేసినా బలైపోయేది సామాన్యులే. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.
అసలే అదును కోసం ఎదురుచూస్తున్న పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్ (Israel) కు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించడమే కాదు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, క్షిపణులు ఇజ్రాయిల్ కు తరలిస్తున్నారు. సొంత దేశంలోనే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఇజ్రాయిల్ ప్రధాని నెతిన్యాహుకు రాజకీయ సంక్షోభం నుంచి బయటపడడానికి హమాస్ తన నెత్తి మీద పాలు పోసినట్టు అయింది. ఇజ్రాయిల్ బందీలుగా చేసిన పాలస్తీనీయులను విడిఛి పెట్టాలని హమాస్ డిమాండ్ చేస్తుంది. దానికి ప్రతిగా తాము బందీచేసిన ఇజ్రాయీలను వదిలివేస్తామని హమాస్ నాయకులు చెప్తున్నారు. కానీ బందీలుగా ఉన్న ఇరుదేశాల వారి క్షేమం ఎవరికీ పట్టడం లేదు. కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అనుకోకుండా దొరికిన సాకు చూపించి గాజాను పూర్తిగా తమ హస్తగతం చేసుకోవడానికి ఇజ్రాయిల్ పూర్తి సైనిక వ్యూహాన్ని రచించింది. అలా హస్తగతం చేసుకోవడం జరిగితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు గానీ, ప్రాణనష్టం మాత్రం పెద్దగా ఉండదు. కానీ గాజాను అష్టదిగ్బంధనం చేసి నీరు, ఆహారం, విద్యుత్తు సరఫరా నిలిపివేసి అమాయక ప్రజలను అన్యాయంగా చంపి వేసే విధానాలను ఇజ్రాయిల్ అనుసరించడం ఇప్పుడు ప్రపంచాన్ని కొంచెం ఆలోచనలో పడవేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అధికారిక లెక్కల ప్రకారం దాదాపు రెండు వేల మంది పాలస్తీనీయులు చనిపోయినట్టు చెబుతున్నారు. వేలమంది క్షతగాత్రులు అయ్యారు. కానీ అనధికారిక సూత్రాల ప్రకారం మృతుల సంఖ్య వేలలో ఉంటుందని తెలుస్తోంది. కక్ష తీర్చుకోవడం అంటే అమాయకుల మానప్రాణాలను, జీవితమంతా చెమటోడ్చి వారు సంపాదించుకున్న ఆస్తిపాస్తులను మట్టి పాలు చేయడం కాదు. కానీ విస్తరణకాంక్షతో రెచ్చిపోయే నియంతలకు సామాన్యుల జీవితాలతో సంబంధమే ఉండదు. ఇప్పటికే పాలస్తీనా భూభాగం క్రమక్రమంగా కుంచించుకుపోతూ రెండు ముక్కలుగా మాత్రమే మిగిలింది. అది వెస్ట్ బ్యాంక్, రెండు గాజా. వెస్టు బ్యాంక్ లో ఇప్పటికే చాలా ప్రాంతాలను ఇజ్రాయిల్ హస్తగతం చేసుకుంది. గాజా ఇప్పుడు ఇజ్రాయిల్ చేతుల్లోకి వెళ్లిపోతే పాలస్తీనా అనే దేశమే ప్రపంచ చిత్రపటంలో అదృశ్యమైపోవచ్చు. కానీ చరిత్ర చెబుతున్న సత్యం మరో రకంగా ఉంది. ఒక మతాన్ని వేరొక మతం, ఒక జాతిని వేరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం కబళించాలని చూస్తే అది అత్యంత తీవ్రమైన ప్రతిఘటనకు దారితీస్తుంది. ఆ ప్రతిఘటన నుంచి తీవ్రవాదులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తారు. అందుకే ఆక్రమణ, అణచివేత ఏనాటికీ పరిష్కారం కాదు. ఒఠరి ఆస్తిత్వాన్ని ఒకరు గుర్తించి, పరస్పరం సహకరించుకొని, సామరస్య పూర్వకంగా జీవించడమే ఏకైక పరిష్కారం. తాజాగా ఇజ్రాయిల్ పాలిస్తీనా మధ్య చెలరేగిన ఈ యుద్ధాన్ని తక్షణమే నిలుపు చేసి, రెండు దేశాల మధ్య సామరస్య పూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి నడుం కట్టాలి. చోద్యం చూస్తూ ఊరుకుంటే ఒక దేశం మరో దేశం చేతిలోకి వెళ్ళిపోవచ్చు గాని, అది సంపూర్ణంగా అదృశ్యం కాదు. కొంతకాలం నిశ్శబ్దం తర్వాత ఆ ఆక్రమణ పరిణామం మరో భయంకరమైన విస్ఫోటనంగా బయటపడవచ్చు. చరిత్ర చెప్పిన ఈ సత్యాన్ని గుర్తించి అన్ని దేశాలూ ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య శాంతిని కుదర్చడానికే ప్రయత్నం చేయాలి. వారి మధ్య ఘర్షణను రెచ్చగొట్టడానికి ఎవరు ఏ స్వార్ధ ప్రయోజనాలతో ప్రయత్నించినా దాన్ని చరిత్ర క్షమించదు.
Read Also : Gudivada Amarnath : చంద్రబాబుకు పెట్టే భోజనంపై అనుమానం వ్యక్తం చేసిన మంత్రి అమర్నాథ్
Related News
UN Apology : భారత్కు ఐక్యరాజ్యసమితి క్షమాపణలు.. ఎవరీ వైభవ్ అనిల్ కాలే ?
UN Apology : భారతదేశానికి ఐక్యరాజ్యసమితి క్షమాపణలు చెప్పింది.