ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం.. ప్రచురణకర్త సంచలన ప్రకటన!
చైనా చొరబాటు అంశంపై పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరవణే పుస్తకాన్ని ఉటంకించడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.
- Author : Gopichand
Date : 10-02-2026 - 10:13 IST
Published By : Hashtagu Telugu Desk
Ex Army Chief Book: భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం విడుదల కాకముందే దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. పార్లమెంటు నుంచి సోషల్ మీడియా వరకు దీనిపైనే చర్చ జరుగుతున్న వేళ ప్రచురణకర్త ‘పెంగ్విన్ ఇండియా’ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పుస్తకం ఇంకా ప్రచురించబడలేదని, దీనికి సంబంధించిన ఏ ప్రతులు కూడా ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదని స్పష్టం చేసింది.
ప్రీ-ఆర్డర్ అంటే పుస్తకం వచ్చినట్లు కాదు
జనరల్ నరవణే స్వయంగా సోషల్ మీడియా వేదికగా పెంగ్విన్ ఇండియా పోస్ట్ను షేర్ చేస్తూ తన పుస్తకం ఇంకా అచ్చు కాలేదని తెలిపారు. “ప్రీ-ఆర్డర్ అంటే పుస్తకం ముద్రించబడినట్లు కాదు” అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ పుస్తక ప్రచురణ హక్కులు తమ వద్దే ఉన్నాయని, ఇప్పటివరకు దీని ఫిజికల్ కాపీలు కానీ, డిజిటల్ వెర్షన్ కానీ విడుదల చేయలేదని పెంగ్విన్ ఇండియా పేర్కొంది. ఏదైనా పుస్తకం అధికారికంగా లాంచ్ అయినప్పుడే అది ప్రచురించబడినట్లు లెక్క అని వివరించింది.
Also Read: అర్జున్ టెండూల్కర్ పెళ్లికి ప్రధాని మోదీ?!
కాపీరైట్ చట్టం కింద హెచ్చరిక
పుస్తకం విడుదల కాకముందే దాని పిడిఎఫ్ లేదా డిజిటల్ కాపీలు ఏవైనా ప్లాట్ఫామ్లలో కనిపిస్తే అది కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రచురణకర్త హెచ్చరించారు. అనుమతి లేకుండా పుస్తకంలోని సమాచారాన్ని పంచుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
This is the status of the book. https://t.co/atLtwhJvl0
— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026
వివాదానికి కారణం ఏమిటి?
ఈ పుస్తకం ఇంత చర్చకు రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు: చైనా చొరబాటు అంశంపై పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరవణే పుస్తకాన్ని ఉటంకించడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.
ఢిల్లీ పోలీసుల కేసు: ఈ పుస్తకానికి సంబంధించిన ఒక ‘ప్రీ-ప్రింట్ కాపీ’ కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ వివాదాల మధ్య పుస్తకం ఎప్పుడు అధికారికంగా విడుదలవుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.