ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్లాండ్ లో ఇంధన సంక్షోభం
- Author : Vamsi Chowdary Korata
Date : 11-03-2026 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
Fuel Crisis హోర్ముజ్ జలసంధిలో రాజుకున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి ఆగ్నేయాసియా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో, థాయ్లాండ్, వియత్నాం ప్రభుత్వాలు తమ దేశాల్లో ‘ఇంధన అత్యవసర పరిస్థితి’ తరహా చర్యలకు శ్రీకారం చుట్టాయి. చమురు ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవడంతో, ప్రభుత్వ యంత్రాంగాలు ఇంధన పొదుపు మంత్రాన్ని పఠిస్తున్నాయి.
వియత్నాంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఫిబ్రవరి చివరి వారం నుంచి అక్కడ పెట్రోల్ ధరలు 32 శాతం పెరగ్గా… డీజిల్, కిరోసిన్ ధరలు ఏకంగా 56 నుండి 80 శాతం వరకు ఎగబాకాయి. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ మిన్ స్వయంగా రంగంలోకి దిగి కువైట్, ఖతార్ వంటి దేశాలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, రాజధాని హనోయిలోని వీధుల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని అదుపు చేసేందుకు పారిశ్రామిక, వాణిజ్య శాఖ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పించాలని స్థానిక సంస్థలకు కీలక సూచనలు చేశారు.
అటు థాయ్లాండ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిదినాలను అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తూనే, మిగిలిన విభాగాల సిబ్బందిని ఇంటి నుండే విధులు నిర్వర్తించాలని ఆదేశించింది. సొంత వాహనాల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించి, సైకిళ్లు లేదా ప్రజా రవాణాను ఆశ్రయించాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. అధికారుల విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధిస్తూనే, కార్పూలింగ్ వంటి పద్ధతులను ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులోకి వచ్చే వరకు ఈ కఠిన నిబంధనలు పాటించక తప్పదని ఇరు దేశాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.