Rohingya Boat Accident: అండమాన్ సముద్రంలో పడవ బోల్తా పడి 250 మంది గల్లంతు!
- Author : Vamsi Chowdary Korata
Date : 15-04-2026 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ అండమాన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్నారులు సహా దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
“దక్షిణ బంగ్లాదేశ్లోని టెక్నాఫ్ నుండి బయలుదేరి మలేషియాకు వెళ్తున్న ట్రాలర్, బలమైన గాలులు, కెరటాల ఉద్ధృతి, పరిమితికి మించిన జనంతో ప్రయాణించడం వంటి కారణాలతో మునిగిపోయినట్లు తెలుస్తోంది” అని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ (యూఎన్హెచ్సీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పడవ ఏప్రిల్ 4వ తేదీన బంగ్లాదేశ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. కాక్స్ బజార్లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేషియాకు వలస వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఐక్యరాజ్య సమితి అధికారులు తెలిపారు. ఈ రోహింగ్యాలు వాస్తవానికి మయన్మార్కు చెందినవారు. కానీ 2017లో అక్కడి సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్కు తరలిపోయారు.