Israel Vs Hamas : శనివారం రోజు ఇజ్రాయెల్ పై దాదాపు 5వేల రాకెట్లతో ఉగ్ర సంస్థ హమాస్ జరిపిన దాడిలో మరణించిన వారి సంఖ్య 500 దాటింది. దాదాపు 2000 మంది ఇజ్రాయెలీలు గాయాలతో ఆస్పత్రుల్లో చేరినట్లు తెలుస్తోంది. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం శనివారం అర్ధరాత్రి గాజా స్ట్రిప్ పై జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 230 మందికిపైగా గాజన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడులను ప్రారంభించే ముందు ఇజ్రాయెల్ సైన్యం ఒక వార్నింగ్ జారీ చేసింది. గాజా స్ట్రిప్లోని ఏడు వేర్వేరు ప్రాంతాల నివాసితులు ఇళ్లను ఖాళీ చేసి ఇతర నగర కేంద్రాలకు వెళ్లాలని సూచించింది. హమాస్ లక్ష్యాలపై దాడులను ప్రారంభించేందుకు ఈ సూచన చేస్తున్నామని పేర్కొంది. దీంతో గాజాలోని డజన్ల కొద్దీ పాలస్తీనియన్ కుటుంబాలు తమ ఇళ్లను విడిచిపెట్టి ఐక్యరాజ్యసమితికి చెందిన పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్పందించిన హమాస్ సంస్థ మిలిటెంట్ నేతలు.. ఈసారి తాము డజన్ల కొద్దీ ఇజ్రాయెలీలను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి గాజా స్ట్రిప్ వ్యాపంగా పంపించామన్నారు. గాజాపై ఇజ్రాయెల్ విచక్షణారహితంగా వైమానిక దాడులు జరిపితే .. కిడ్నాపైన ఇజ్రాయెలీలు కూడా అందరితో పాటు మట్టికరుస్తారని హెచ్చరించారు. ఇజ్రాయెల్ పై పోరాటంలో తమకు ఇరాన్ మద్దతు ఇస్తోందని ఓ హమాస్ నేత ప్రకటించడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు ఇజ్రాయెల్ లోని దాదాపు 22 చోట్ల పాలస్తీనా చొరబాటుదారులు ఆ దేశ సైన్యంతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. హమాస్ దాడికి ప్రతిచర్యగా గాజాకు విద్యుత్ సప్లై, ఇంధన సప్లై, వస్తువుల సరఫరాను ఇజ్రాయెల్ ఆపేసింది. దీంతో పాలస్తీనా ప్రజలు అవస్థలు పడుతున్నారు. పాలస్తీనాకు సంబంధించిన విద్యుత్ స్టేషన్లు, ఇంధన స్టేషన్లన్నీ ఇజ్రాయెల్ భూభాగంలో ఉన్నాయి. దీంతో దాడులు జరిగిన ప్రతిసారీ ఇజ్రాయెల్ అధికారులు ఈవిధంగా విద్యుత్ సరఫరాను ఆపేస్తుంటారు. శనివారం రాత్రంతా గాజా ప్రజలు అంధకారంలో గడిపారు. ఈజిప్ట్, గాజా మధ్య ఉన్న బార్డర్ ఇజ్రాయెల్ అదుపులో ఉంది. దీంతో గాజాలోకి నిత్యావసరాల సప్లైను కూడా ఇజ్రాయెల్ (Israel Vs Hamas) నియంత్రిస్తుంటుంది.
Also read : India Support Israel: ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చిన భారత్.. నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం..!