Pakistan: పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు.. ద్విచక్రవాహనాన్ని రిపేర్ చేస్తుండగా ఘటన.. ఒకరు మృతి
పాకిస్థాన్ (Pakistan)లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్లో పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.
- Author : Gopichand
Date : 19-05-2023 - 8:35 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan: పాకిస్థాన్ (Pakistan)లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్లో పేలుడు (Blast) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. జియో న్యూస్ కథనం ప్రకారం.. ఈ పేలుడు (Blast) మోటారుసైకిల్లో జరిగిందని, దుండగులు ఈ బైక్లో బాంబును ఉంచారని, దాని పేలుడులో ఒకరు మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
మోటార్ సైకిల్లో బాంబు
పెషావర్ పాకిస్థాన్లోని ఆరవ అతిపెద్ద నగరం ఖైబర్ పఖ్తుంక్వా రాజధాని. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మోటార్సైకిల్లో అమర్చిన బాంబు పేలడంతో పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు జరిగిన తీరుపై సమాచారం సేకరిస్తున్నామన్నారు. జియో న్యూస్ ప్రకారం.. మోటార్ సైకిల్ రిపేర్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
Also Read: Nigeria: నైజీరియాలో ఆగని ఘర్షణలు.. ఇప్పటివరకు 85 మంది మృతి
ద్విచక్రవాహనాన్ని రిపేర్ చేస్తుండగా పేలుడు
పెషావర్ నగరంలోని రింగ్ రోడ్డులోని ఓ హోటల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన మోటార్సైకిల్ను సరిచేయడానికి దుకాణానికి వెళ్లాడు. మెకానిక్ మోటార్ సైకిల్ రిపేర్ చేస్తుండగా పేలిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు సమయంలో షాపులో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పేలుడు కారణంగా దుకాణం, దాని చుట్టుపక్కల నిర్మాణాలకు అపార నష్టం వాటిల్లింది.
గాయపడిన ముగ్గురిలో మోటార్సైకిల్ యజమాని కూడా ఉన్నారని, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాంబు నిర్వీర్య బృందం ఒక ప్రకటన ప్రకారం.. పేలుడులో 200 గ్రాముల ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (IED) ఉపయోగించబడింది. అధికారుల ప్రకారం.. కుటుంబ సంబంధిత సంఘటనలలో తరచుగా IED లు ఉపయోగించబడతాయి. ఈ విషయమై తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.