Brother Weds Sister : అన్నాచెల్లెళ్ల పెళ్లి.. గవర్నమెంట్ డబ్బుల కోసం కక్కుర్తి
Brother Weds Sister : సీఎం సామూహిక వివాహ పథకం నుంచి వచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు. వావీ వరుస మర్చిపోయి ఏకంగా అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు.
- Author : Pasha
Date : 19-03-2024 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
Brother Weds Sister : సీఎం సామూహిక వివాహ పథకం నుంచి వచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు. వావీ వరుస మర్చిపోయి ఏకంగా అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. బీజేపీ దిగ్గజ నేత యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ నెల 5న మహారాజ్గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్లో ‘‘ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం’’ కింద 38 నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పెళ్లి చేసింది. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బుల కోసం ఆ రోజు ఓ యువతి తన సోదరుడితో కలిసి పెళ్లి మంటపంలో ఏడడుగులు నడిచింది. వాస్తవానికి ఆమెకు ఏడాది క్రితమే పెళ్లి జరగ్గా, ప్రస్తుతం భర్త జీవనోపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు.
We’re now on WhatsApp. Click to Join
తన భార్య, ఆమె సోదరుడితో(Brother Weds Sister) పెళ్లి చేసుకుందన్న సమాచారం గ్రామస్తుల ద్వారా సదరు మహిళ భర్తకు తెలిసింది. ఆ పెళ్లి ఫొటోలను కూడా స్థానికులు అతడికి పంపారు. దీంతో ఆ మహిళ భర్త ఆందోళనకు గురయ్యాడు. అసలు విషయం తెలుసుకోమని స్నేహితులకు పంపాడు.ఈ పెళ్లి జరిగిన విషయం నిజమేనని నిర్ధారణ అయ్యాక.. ఆ విషయాన్ని లక్ష్మీపుర్ ప్రభుత్వ అధికారులకు తెలియజేశాడు. తాను ఉండగా తన భార్యకు పెళ్లి ఎలా చేయిస్తారంటూ ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. సదరు అన్నాచెల్లెళ్లకు ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసుకున్నారు.
Also Read :Hanuman: ఓటీటీలో హనుమాన్ మూవీ రికార్డ్.. 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్
‘‘సీఎం వివాహ పథకం కింద అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్న వ్యవహారంపై విచారణ చేశాం. అసలు విషయం తెలిసి యువతికి అందజేసిన వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాం. ప్రభుత్వం అందించే నిధులను ఆపేశాం. ఎవరు తప్పు చేసినా వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని లక్ష్మీపుర్ బీడీఓ అమిత్ మిశ్రా వెల్లడించారు.
Also Read :Hanu Man OTT: ఓటీటీలో హనుమాన్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి.. వీడియో వైరల్?
పెళ్లి స్కీంలో ఏం ఇచ్చారంటే..
సీఎం సామూహిక వివాహాల పథకం కింద పెళ్లి చేసుకున్న జంటలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.51వేలు చొప్పున ఇస్తోంది. ఆ మొత్తంలో రూ.35వేలను వధువు బ్యాంకు అకౌంట్లో వేస్తారు. మిగతా రూ.10వేలను బహుమతుల కోసం, రూ.6వేలను పెళ్లి ఏర్పాట్లకు కేటాయిస్తారు. దీంతోపాటు మంగళసూత్రం, పెట్టె, బట్టలు తదితర కానుకలను అందిస్తారు.