India-Pakistan Tension: భారత్- పాక్ మధ్య యుద్ధం జరిగితే భారీగా ప్రాణ నష్టం?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న తీరు వల్ల పాకిస్థాన్ ఒత్తిడిలో ఉందని అన్నారు.
- Author : Gopichand
Date : 06-05-2025 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
India-Pakistan Tension: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదం, పాకిస్థాన్పై (India-Pakistan Tension) గట్టిగా వ్యవహరిస్తోంది. దీంతో పాకిస్థాన్లో స్పష్టమైన ఆందోళన కనిపిస్తోంది. ఎప్పుడైనా భారత్ తమపై దాడి చేయవచ్చనే భయం పాకిస్థాన్ను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మే 7న అన్ని రాష్ట్రాలకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై స్పందిస్తూ ఆర్మీ రిటైర్డ్ బ్రిగేడియర్ విజయ్ సాగర్.. యుద్ధ సంభావనలను కొట్టిపారేయలేమని అన్నారు.
రిటైర్డ్ బ్రిగేడియర్ విజయ్ సాగర్ (మే 6, 2025) న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్తో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఐక్యరాష్ట్రాల భద్రతా మండలి సమావేశం, సింధు జల ఒప్పందంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలపై స్పందిస్తూ.. ఏప్రిల్ 22న జరిగిన ఫల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయని, పూర్తి స్థాయి యుద్ధ సంభావనను తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. “యుద్ధ పరిస్థితిలో రెండు పక్షాల నుంచి వైమానిక దాడులు లేదా క్షిపణి దాడులతో సహా దూకుడు చర్యలు జరిగే అవకాశం ఉంది. ఏ దేశంలోనైనా పౌర ప్రాంతాలపై దాడి జరిగితే, తప్పనిసరిగా ప్రాణనష్టం, ఆస్తినష్టం భారీగా ఉంటుంది. ఈ నష్టాన్ని ఎలా తగ్గించాలి? మాక్ డ్రిల్స్ నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం, యుద్ధ సమయంలో సన్నద్ధత ఎలా ఉండాలి? రక్షణ ఎలా చేసుకోవాలి అనేదే. ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధంలో సైన్యం మాత్రమే కాదు. మన ప్రజలు కూడా పోరాడతారు” అని వివరించారు.
Also Read: Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. ఆ మోడల్ బైక్లు బంద్!
ఐక్యరాష్ట్రాల భద్రతా మండలి సమావేశంపై బ్రిగేడియర్ విజయ్ సాగర్ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న తీరు వల్ల పాకిస్థాన్ ఒత్తిడిలో ఉందని అన్నారు. పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. కానీ భారత ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించడంతో ఆ బెదిరింపులు పనిచేయవని పాకిస్థాన్కు అర్థమైందని ఆయన పేర్కొన్నారు. ఏ సమావేశంలో పాల్గొన్నా, పాకిస్థాన్కు మద్దతు ఇచ్చే దేశం లేదని ఆయన అన్నారు.
సింధు జల ఒప్పందం నిలిపివేయడంపై ఆయన మాట్లాడుతూ.. దీని ద్వారా పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, భారత్ నీటిని ఆపివేస్తుందని, భారత సైన్యం పాకిస్థాన్లో ఉగ్రవాదానికి మూలమైన వారిని, భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారిని లక్ష్యంగా చేసుకుంటుందని అన్నారు. ఇందులో పాకిస్థాన్ ఐఎస్ఐ లేదా ఆర్మీ చీఫ్ కూడా ఉండవచ్చని, భారత సైన్యం దశలవారీగా వీరిపై చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.