GST On UPI transactions: రూ. 2వేలకు మించిన యూపీఐ పేమెంట్స్పై జీఎస్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే?
ప్రభుత్వం 2,000 రూపాయలకు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలపై వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియా నివేదికల్లో ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
- Author : Gopichand
Date : 18-04-2025 - 8:32 IST
Published By : Hashtagu Telugu Desk
GST On UPI transactions: ప్రభుత్వం 2,000 రూపాయలకు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (GST On UPI transactions) లావాదేవీలపై వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియా నివేదికల్లో ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో 2,000 రూపాయలకు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పడం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. అవి నిరాధారమైనదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ప్రకటనలో పేర్కొన్నారు.
మార్చి నెలలో భారతదేశంలో యూపీఐ ద్వారా లావాదేవీలు 24.77 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరాయి. యూపీఐపై జీఎస్టీ విధింపు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే యూపీఐ చెల్లింపులపై లేదా 2,000 రూపాయలకు మించిన లావాదేవీలపై జీఎస్టీ విధించబడుతుందని అనేక నివేదికలు సూచించాయి. ఈ విషయం వ్యక్తిగత వినియోగదారుల నుండి చిన్న వ్యాపార యజమానుల వరకు యూపీఐ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఈ ఉన్నత-విలువ లావాదేవీలపై 18 శాతం జీఎస్టీ విధించబడవచ్చని ఊహాగానాలు వచ్చాయి. ఇది చాలా డిజిటల్ సేవలకు ప్రామాణిక రేటు.
Also Read: KCR : బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ..రజతోత్సవ సభ ఏర్పాట్ల పై చర్చ!
నివేదికల ప్రకారం.. 2,000 రూపాయలకు మించిన యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ వర్తించిన తర్వాత పీర్-టు-పీర్, వ్యాపారి లావాదేవీలు రెండూ దీనిలో చేర్చబడవచ్చని చెప్పబడింది. ప్రతిపాదిత జీఎస్టీ రేటు 18 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. భారతదేశ జీఎస్టీ సేకరణ 2025 ఫిబ్రవరిలో 9.1 శాతం పెరిగి సుమారు 1.84 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. మార్చి 1, శనివారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. స్థూల ప్రాతిపదికన, కేంద్ర జీఎస్టీ నుండి 35,204 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ 43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 90,870 కోట్లు, పరిహార సెస్ 13,868 కోట్లు సేకరించబడ్డాయి.