Telangana: చిన్న దొర చెప్పేవి శ్రీ రంగ నీతులు..చేసేవి పనికి మాలిన పనులు
చిన్న దొర, పెద్ద దొర అంటూ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ లపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
- By Praveen Aluthuru Published Date - 08:20 PM, Sat - 5 August 23

Telangana: చిన్న దొర, పెద్ద దొర అంటూ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ లపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సమస్య ఏదైనా తెలంగాణ ప్రభుత్వానికి చురకలంటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు షర్మిల. ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ పై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తారు.
చిన్న దొర చెప్పేవి శ్రీ రంగ నీతులు..చేసేవి పనికి మాలిన పనులు అంటూ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేశారు. భూములు అమ్మొద్దని ఉద్యమంలో చెప్పిన ఊకదంపుడు మాటలకు స్వరాష్ట్రంలో సర్కారీ భూములపై చేస్తున్న దందాకు పొంతనే లేదని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ పని కాకుంటే మీ 9 ఏళ్ల పాలనలో 38 వేల ఎకరాలు ఎందుకు అమ్మినట్లు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వెతికి మరీ ఫర్ సేల్ బోర్డులు ఎందుకు పెడుతున్నట్లు అంటూ నిలదీశారు. మరో 50 వేల ఎకరాలు అమ్మేందుకు కసరత్తు ఎందుకు చేస్తున్నట్లు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది వైఎస్ షర్మిల. తెచ్చిన అప్పులు కమీషన్ల కింద..రాష్ట్ర ఆమ్దానీ విలాసాల కింద ఖర్చు పెడుతున్న రాబందులకు, భూములు అమ్మకపోతే పొద్దు గడవదు. అందుకే BRS అంటే భూములమ్మే రాష్ట్ర సమితి. సర్కారీ భూములు మింగేసే “భూ భకాసుర రాష్ట్ర సమితి “. భవిష్యత్ అవసరాలకు భూములు లేకుండా కొల్లగొట్టే బందిపోట్లకు బుద్ధి చెప్పకపోతే రేపు రాష్ట్రాన్ని సైతం వేలం వెయ్యక మానరు అంటూ ధ్వజమెత్తారు.
Also Read: IND vs WI 2nd T20: ఒక వికెట్ తో హార్దిక్ పాండ్యా రికార్డ్