Durgam Cheruvu : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
- By Kavya Krishna Published Date - 12:06 PM, Thu - 19 June 25

Durgam Cheruvu : హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని 27 ఏళ్ల సుష్మగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం సుష్మ హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆ రోజు సాయంత్రం గడిచినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనుమానంతో చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది.
అయితే, అదే రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఒక మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. దర్యాప్తులో అది సుష్మదిగా గుర్తించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఇంతవరకు సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సుష్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఈ ఘటనతో సుష్మ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. భవిష్యత్తు ఆశలతో ముందుకు సాగుతున్న ఓ యువతి ఇలా అకాల మరణం చెందడంతో ఆమె మిత్రులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
Po*nograpic: హైదరాబాద్లో పిల్లల అశ్లీల వీడియోలు షేర్ చేసిన 18 మంది అరెస్ట్