White Paper : తెలంగాణ ఆర్థికస్థితిపై శ్వేతపత్రం రిలీజ్
White Paper : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ సర్కారు విడుదల చేసింది.
- By Pasha Published Date - 12:26 PM, Wed - 20 December 23

White Paper : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ సర్కారు విడుదల చేసింది. దీన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో రిలీజ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించలేదనీ, ఫలితంగా రోజువారీ ఖర్చులకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా నిధులను తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని భట్టి పేర్కొన్నారు. ఇది దురదృష్టకరమైన పరిణామమని చెప్పారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ మరోసారి హీటెక్కింది. ఇంతకుముందు గవర్నర్ స్పీచ్కు ధన్యవాద తీర్మానంపైనే అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక రేంజ్లో మాటల యుద్ధం జరిగింది. ఇక ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాన్ని విడుదల చేయడంతో అసెంబ్లీ అట్టుడికింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ఈ శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ శ్వేత పత్రంలో ఆర్ధికశాఖ, ఇరిగేషన్, విద్యుత్ సహా వివిధ రంగాల లెక్కలను, కేటాయింపులు, వ్యయాల వివరాలను పొందుపరిచారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే దీనికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దీటైన కౌంటర్లు ఇస్తోంది. రూపాయి అప్పుచేస్తే, వెయ్యి రూపాయల ఆస్తి కూడబెట్టామని బీఆర్ఎస్ వాదిస్తోంది. సభలో ప్రజెంటేషన్కు తమకూ అవకాశం ఇవ్వాలని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.అయితే శ్వేతపత్రాన్ని చదివేందుకు తగిన సమయం ఇవ్వనందుకు ప్రతిపక్ష సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుపట్టారు. 42 పేజీల పుస్తకాన్ని(White Paper) చేతిలో పెట్టి వెంటనే స్పందించమంటే ఎలాగని ఆయన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. ఇవాళ తొలుత సభ ప్రారంభం కాగానే ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ పేరును, సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేరును స్పీకర్ ప్రకటించారు.