Telangana Politics : ఆగస్టు 4న తెలంగాణలో ఏంజరగబోతుంది..?
Telangana Politics : ఈ నివేదిక సారాంశాన్ని కమిషన్ ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. అదే రోజున కేబినెట్ సమావేశమై కాళేశ్వరం నివేదికపై చర్చించనుంది
- Author : Sudheer
Date : 02-08-2025 - 7:14 IST
Published By : Hashtagu Telugu Desk
ఆగస్టు 4వ తేదీ తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను ఆగస్టు 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది. 650 పేజీలు, మూడు వాల్యూమ్లుగా ఉన్న ఈ నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, డిజైన్ తదితర అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి వివరాలను పొందుపరిచారు. ఈ నివేదిక సారాంశాన్ని కమిషన్ ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. అదే రోజున కేబినెట్ సమావేశమై కాళేశ్వరం నివేదికపై చర్చించనుంది. ఈ చర్చల అనంతరం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Content Creators : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న గూగుల్?
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, నాణ్యతా లోపాలు ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక కారణంగా చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. 15 నెలల పాటు జరిగిన ఈ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేంద్రర్తో సహా 115 మంది సాక్షులను కమిషన్ విచారించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది. అయితే, 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని స్తంభాలు కూలిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజ్ సమస్యలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. దీంతో దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు పెరిగాయి.
Amazon Offers : అమెజాన్ లో దుమ్మురేపే ఆఫర్లు..మిస్ చేసుకుంటే మీకే నష్టం
ఆగస్టు 4న కేబినెట్ సమావేశం తర్వాత కాళేశ్వరం నివేదికలోని అంశాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవచ్చని, అవినీతి ఆరోపణలపై ఈడీ, ఏసీబీ వంటి సంస్థల ద్వారా మరింత విచారణ జరిపించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 4న తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.