Union Minister Rajnath Singh: సెప్టెంబర్ 17న తెలంగాణకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్!
కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. ఈ వేడుకలు తెలంగాణ ప్రజల పోరాటాలను, నిజాం పాలన నుండి స్వాతంత్య్రం పొందిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేస్తాయి.
- Author : Gopichand
Date : 23-08-2025 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
Union Minister Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Union Minister Rajnath Singh) సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలను గత కొన్ని సంవత్సరాలుగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాముఖ్యత
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగానే ఉంది. అప్పుడు హైదరాబాద్ను పరిపాలిస్తున్న నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి నిరాకరించారు. దీంతో నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల, ఆర్య సమాజ్, హిందూ మహాసభ వంటి వివిధ సంస్థలు ఉద్యమాలు ప్రారంభించాయి. నిజాం సైన్యం, రజాకార్లు ప్రజలపై దాడులు చేయడం, దోపిడీలు చేయడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు.
Also Read: Dream 11 App Money: డ్రీమ్11 యాప్ వాలెట్లో డబ్బులు ఉన్నాయా? అయితే విత్ డ్రా చేసుకోండిలా?!
ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్పై “ఆపరేషన్ పోలో” ప్రారంభించింది. కేవలం ఐదు రోజుల్లోనే భారత సైన్యం నిజాం సైన్యాన్ని ఓడించి.. సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఈ రోజును తెలంగాణ ప్రజలు తమ విముక్తి దినంగా భావిస్తారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ రోజును అధికారికంగా నిర్వహించకపోయినా భారత ప్రభుత్వం దీనిని “తెలంగాణ విమోచన దినోత్సవంగా” నిర్వహిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు
కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. ఈ వేడుకలు తెలంగాణ ప్రజల పోరాటాలను, నిజాం పాలన నుండి స్వాతంత్య్రం పొందిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక ప్రాముఖ్యతను జాతీయ స్థాయిలో గుర్తించడం.