Bandi Sanjay: కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి
ముఖ్యంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనను ఆయన ముందుంచారు.
- By Gopichand Published Date - 08:21 PM, Wed - 18 December 24

Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.224 కోట్ల మేరకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ఈరోజు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు, వంతెనల అభివృద్ధికి సంబంధించి పలు అంశంపై గడ్కరీ దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనను ఆయన ముందుంచారు. ప్రధానంగా కేశవపట్నం నుండి పాపయ్యపల్లె మీదుగా సైదాపూర్ వరకు 15 కి.మీల మేరకు సింగిల్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని, కొడిమ్యాల నుండి గోవిందారం మీదుగా తాండ్రియాల వరకు 30 కి.మీల మేరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని కోరారు. అట్లాగే చొప్పదండి మండలం అర్నకొండ నుండి గోపాల్ రావు పేట మీదుగా మల్యాల చౌరస్తా వరకు 45 కి.మీల మేరకు, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ నుండి సింగారం మీదుగా ముస్తాబాద్ మండలం రాంరెడ్డి పల్లె వరకు 15 కి.మీల మేరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని విజ్ఝప్తి చేశారు.
Also Read: Mallya Assets Sales : విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి బ్యాంకులకు 14 వేల కోట్లు – నిర్మలా సీతారామన్
దీంతోపాటు కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లి పోతూరు రోడ్ (కి.మీ 18/0- 2), బావూపేట ఖాజీపూర్ ( కి.మీ2/0-2) వరకు మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం సహా మొత్తం 90 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ పనులకుగాను రూ.224 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఝప్తి చేశారు. ఈ సందర్బంగా సానుకూలంగా కేంద్ర మంత్రి గడ్కరీ త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని బండి సంజయ్ కు హామీ ఇచ్చారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే సీఆర్ఐఎఫ్ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపైనా గడ్కరీ ఆరా తీశారు.