Union Minister Bandi Sanjay: రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. ఏం అడిగారంటే.?
కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు.
- Author : Gopichand
Date : 10-09-2024 - 2:22 IST
Published By : Hashtagu Telugu Desk
Union Minister Bandi Sanjay: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Union Minister Bandi Sanjay) లేఖ రాశారు. ఈ లేఖలో కరీంనగర్- హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav)ను కోరారు. ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన బండి సంజయ్ ఈ మేరకు లేఖను అందజేశారు.
కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్ లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లేన్ నిర్మాణం పూర్తయితే తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కరీంనగర్- వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
Also Read: NTR Devara Runtime : దేవర ఫ్యాన్స్ ని భయపెడుతున్న రన్ టైం..!
దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ ఎక్స్ ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైల్వే మంత్రికి బండి సంజయ్ మరో లేఖ అందజేశారు. ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్ లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు.
ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలన మెరుగుపర్చాలని, పార్కింగ్ ను విస్తరించాలని, సోలార్ ప్యానెళ్లను అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.