Godavari Flood : భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ
గంటగంటకూ పెరుగుతున్న ఉధృతితో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది
- By Sudheer Published Date - 05:38 PM, Sat - 27 July 24

భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాక ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు..గోదావరి వరదలతో ఉరకలేస్తుంది. దీంతో భద్రాచలం వద్ద ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గంటగంటకూ పెరుగుతున్న ఉధృతితో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక (Third Danger Alert Issued) జారీ చేసారు అధికారులు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క వరదల ప్రభావంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు ప్రధాన రహదారులపై గోదావరి వరదనీరు చేరింది. మరోవైపు గోదారి మహోగ్రరూపంతో పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదలతో జనం అల్లాడుతున్నారు. వరద ఉదృతి పెరడం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ కావడం తో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు.
భద్రాచలంలోని పట్టణ సరిహద్దులో ఉన్న ఏఎంసీ కాలనీలోనికి వరద నీరు చేరింది. పట్టణ బ్యాక్ వాటర్, ఆంధ్ర – తెలంగాణ సరిహద్దులో ఉన్న స్లూయిజ్ పనిచేయకపోవడంతో పట్టణంలోని బ్యాక్ వాటర్ గోదావరిలోనికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కాలనీలోకి మురుగునీరు వెనుకకు పారుతుంది. దీంతో సుమారు 30 ఇల్లు ముంపునకు గురయ్యాయి. ఇదే క్రమంలో పర్ణశాల సబ్ స్టేషన్ వద్ద రోడ్ పైకి, దుమ్ముగూడెం మండలం తూరుబాక బ్రిడ్జి దగ్గర రోడ్డు పైకి గోదావరి వరద నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లో అంతరాయం కలిగింది.
మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో, దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Read Also : AMMA : యువతకు డ్యాన్స్, యాక్టింగ్ క్లాసులు నిర్వహించనున్న ‘అమ్మ’..