Cold Temperatures: చలి గుప్పిట్లో తెలంగాణ, వణుకుతున్న జనం!
- Author : Balu J
Date : 27-12-2023 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు చలి గాలులు కూడా పెరిగాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సంగారెడ్డిలో 9.1 డిగ్రీలు, ఆదిలాబాద్లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మంచిర్యాలు, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు పొగమంచు కూడా ఆ ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది. శంషాబాద్ పరిసర గ్రామాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో గత రెండు రోజులుగా పాలమూరు వ్యాప్తంగా విపరీతమైన పొగమంచు ఏర్పడింది. తెల్లవారుజామున 12 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. చలికాలం గరిష్టంగా ఉండటంతో నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ ప్రాంతాలు, ముఖ్యంగా శ్రీశైలం హైవే వెంబడి ఉన్న అచ్చంపేట, నల్లమల్ల అటవీ ప్రాంతాలను పొగమంచు కమ్ముకోవడంతో ప్రయాణికులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: Shocking: ప్రియుడిపై గంజాయి కుట్ర, అడ్డంగా దొరికిన యువతి!