Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి సిద్ధమైన హైదరాబాద్!
సమ్మిట్ రెండవ రోజు డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనుంది. ఈ విజన్ డాక్యుమెంట్ 2047 నాటికి 3 ట్రిలియన్ US డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఒక రోడ్మ్యాప్ను రూపొందిస్తుంది.
- By Gopichand Published Date - 03:01 PM, Sat - 6 December 25
Telangana Rising Global Summit: భారతదేశం నుండి విదేశాల నుండి ప్రముఖులు, అగ్రశ్రేణి భారతీయ పారిశ్రామికవేత్తలు, టెక్నోక్రాట్లు, విద్యావేత్తలు, సినీ ప్రముఖులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సహా వివిధ రంగాల నిపుణులు డిసెంబర్ 8, 9 తేదీలలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) 2025కి హాజరుకానున్నారు.
రాష్ట్ర వినూత్న భవిష్యత్తును ప్రదర్శించే ఈ అంతర్జాతీయ సదస్సులో రెండు రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, ఐటీ-సెమీకండక్టర్లు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్ల రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు , నిపుణులు ఆయా రంగాలలో వృద్ధి సామర్థ్యంపై ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, UNICEFతో పాటు TERI, BCG, మైక్రాన్ ఇండియా, హిటాచీ ఎనర్జీ, O2 పవర్, గ్రీన్కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటి హైదరాబాద్, నాస్కామ్, సాఫ్రాన్, డీఆర్డీఓ, స్కైరూట్, ధ్రువ స్పేస్, అమూల్, లారస్ ల్యాబ్స్, జీఎంఆర్, టాటా రియాల్టీ, కోటక్ బ్యాంక్, గోల్డ్మన్ శాక్స్, బ్లాక్స్టోన్, డెలాయిట్, క్యాపిటాల్యాండ్, స్విగ్గీ, ఏడబ్ల్యూఎస్, రెడ్. హెల్త్, పీవీఆర్ ఐనాక్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్స్ వంటి సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.
Also Read: Entertainment : ప్రపంచ ఎంటర్టైన్మెంట్ చరిత్రలో అతిపెద్ద డీల్
కీలక సెషన్లు, ప్రముఖులు
క్రీడా ప్రముఖులు: పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ సెషన్కు హాజరవుతారు.
సినీ పరిశ్రమ: ఎస్ఎస్ రాజమౌళి, రితేష్ దేశ్ముఖ్, సుకుమార్, గునీత్ మోంగా, అనుపమ చోప్రా “క్రియేటివ్ సెంచరీ- సాఫ్ట్ పవర్ & ఎంటర్టైన్మెంట్” అనే ప్యానెల్ చర్చలో మాట్లాడుతారు.
సన్నాహాలు, విజన్ డాక్యుమెంట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సదస్సుకు తగిన ఏర్పాట్లు చేయడానికి, ప్రతినిధులకు గొప్ప ఆతిథ్యం అందించడానికి సమన్వయం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కి సమానంగా ఈ సదస్సును నిర్వహించేందుకు సీఎం ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. సదస్సు వేదిక వద్ద పటిష్టమైన ఏర్పాట్లు ఉండేలా చూసేందుకు సీఎం అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సమ్మిట్ రెండవ రోజు డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనుంది. ఈ విజన్ డాక్యుమెంట్ 2047 నాటికి 3 ట్రిలియన్ US డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఒక రోడ్మ్యాప్ను రూపొందిస్తుంది. ఈ పత్రంలో అన్ని రంగాలలో తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, కొత్త ఆవిష్కరణల కోసం సమగ్ర ప్రణాళికలు కూడా రూపొందించబడతాయి.