Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్-1గా ప్రమోషన్లు
- Author : Vamsi Chowdary Korata
Date : 13-06-2026 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు ముగింపు లభించింది. శాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులుగా విధుల్లో ఉన్న 26 మంది అధికారులకు గ్రేడ్-1 అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హత సాధించిన ఈవోలకు పదోన్నతి నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ వి.హన్మంతరావు, రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐకాస కన్వీనర్ డీవీఆర్ శర్మలతో పాటు పలువురు అర్చక సంఘాల ప్రతినిధులు, శాఖాధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పదోన్నతులు పొందిన అధికారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. దేవాలయాల సర్వతోముఖాభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ‘రాష్ట్రంలోని ఆలయాల నిర్వహణ మరింత మెరుగ్గా, పారదర్శకంగా సాగాలంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు, అర్చకులు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉండాలి. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని మంత్రి హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్న ఆమె.. ఈ పదోన్నతులు కేవలం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పదోన్నతులతో పాటు ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈవో పోస్టుల భర్తీ, పదోన్నతుల ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగుల పదోన్నతులతో పాటు అర్చక, దేవాలయ సిబ్బందికి మంత్రి కొండా సురేఖ మరో తీపి కబురు అందించారు. అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా అందుతున్న వివిధ రకాల ఆర్థిక సహాయాన్ని, గ్రాంట్లను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా రిటైర్మెంట్ గ్రాట్యుటీ, పిల్లల ఉపనయనం గ్రాంట్, సొంత ఇంటి నిర్మాణ పథకానికి ఇచ్చే సాయం, అలాగే ఉన్నత విద్యా పథకం తదితర సంక్షేమ పథకాల ఆర్థిక ప్రయోజనాల పెంపు వివరాలను ఆమె వెల్లడించారు. ఈ పెంచిన నూతన ఆర్థిక ప్రయోజనాలు మరియు అలవెన్సులు అన్నీ కూడా ఈ ఏడాది అంటే 2026 ఏప్రిల్ ఒకటి నుంచే పాత తేదీ ప్రకారం అమల్లోకి వచ్చాయని మంత్రి సురేఖ స్పష్టంచేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల పట్ల రాష్ట్ర అర్చక సమాఖ్య, దేవాదాయ శాఖ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.