Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి
- Author : Vamsi Chowdary Korata
Date : 10-05-2026 - 10:02 IST
Published By : Hashtagu Telugu Desk
తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభాగాల్లో యువత, నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ తలసేమియా వ్యాధి తీవ్రతను వివరించారు. “దేశంలో ఏటా 12 వేల మంది చిన్నారులు తలసేమియాతో జన్మిస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా ఎందరో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితులను కాపాడేందుకు రక్తమార్పిడి ఒక్కటే మార్గం. రక్తదానంపై అపోహలు వీడి ముందుకు రావాలి. యువత తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా భవిష్యత్ తరాలను కాపాడవచ్చు” అని ఆమె పిలుపునిచ్చారు.
ఈ అవగాహన కార్యక్రమానికి భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం, మందులు అందిస్తోందని భువనేశ్వరి గుర్తుచేశారు. త్వరలోనే విజయవాడ, అనంతపురంలో కొత్తగా తలసేమియా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నగర పౌరులు పాల్గొన్నారు.