మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
- Author : Vamsi Chowdary Korata
Date : 13-02-2026 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Municipal Election Results తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తెలియనుంది. అయితే, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డుల నుంచి 10,179 మంది, ఏడు కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్ల నుంచి 2,225 మంది అభ్యర్థులు పోటీపడిన విషయం తెలిసిందే. కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో మొత్తం 123 చోట్ల కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ముందుగా అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లలో వార్డులు, డివిజన్ల వారీగా భద్రపరిచిన సీల్డ్ బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ సెంటర్లోని లెక్కింపు టేబుల్ వద్దకు తీసుకురానున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల ఎదుట సీల్ ఓపెన్ చేసి వార్డు, డివిజన్లలో ఉపయోగించిన మొత్తం బ్యాలెట్ బాక్సులను ఒకేసారి ఓపెన్ చేసి అన్ని ఓట్లను ఓ డ్రమ్ములో పోసి వాటిని పూర్తిగా కలుపనున్నారు. ఆ తర్వాత 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్ చేసి అలా 40 బండిల్స్ను అంటే వెయ్యి ఓట్లను ఒక కట్టగా కట్టి టేబుళ్లపై పెట్టనున్నారు. ఇక బ్యాలెట్లు పేపర్లు 25 కంటే తక్కువగా ఉంటే వాటిని ప్రత్యేక బండిల్గా తయారు చేసి కౌంట్తో లేబుల్ చేయనున్నారు.
భద్రత కట్టుదిట్టం..
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా కట్టదిట్టమై పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్ల లోపల, బయట సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను పూర్తిగా నిషేధించినట్లుగా ఇప్పటికే ఈసీ ప్రకటించింది. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించింది. కేవలం చెల్లుబాటు అయ్యే పాస్లతో మాత్రమే లోనికి ప్రవేశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్లలో కలిపి మొత్తం 10,800 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
పోటీ చేసే ప్రతి అభ్యర్థికి నోటా, అనుమానాస్పద ఓట్లకు కంపార్ట్మెంట్లతో కూడిన చెక్క ట్రేలను ఉపయోగిస్తున్నారు. అనుమానాస్పద ఓట్లు, నోటా ఓట్లను కూడా బండిల్గా కట్టనున్నారు. ఆ తర్వాత ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు ఓ పేపర్పై రాసి కౌంటింగ్ సూపర్ వైజర్ సంతకం చేస్తారు. ప్రతీ రౌండ్ కౌంటింగ్ తర్వాత ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకోనున్నారు. అనంతరం ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లుగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేయనున్నారు.