Minister Advice: తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కీలక సూచన
ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు.
- By Gopichand Published Date - 01:24 PM, Sun - 17 November 24

Minister Advice: తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు (Minister Advice) చేశారు. ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోకండని సూచించారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు.
తాజాగా ఈ విషయమై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు.
మరో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 732 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టులు, 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్(ఎంఎన్జే) పోస్టులు, 24 ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు. విద్యార్హతలు, రాతపరీక్షలు ఇతర నిబంధన ప్రకారం పారదర్శకంగా ఈ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు.
ఇందులో ఎలాంటి రాజీ లేదని, ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు ఇచ్చి, వారిఫై ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకు మోసగాళ్ల సమాచారాన్ని అందజేయాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.