Future City: ఫ్యూచర్సిటీలో 37 గ్రామాల విలీనం : సీఎం రేవంత్
- Author : Vamsi Chowdary Korata
Date : 11-06-2026 - 11:10 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫ్యూచర్సిటీ దిశగా అడుగులు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు రేవంత్ హాజరయ్యారు. ఈ సభ జరుగుతున్న సమయంలో కొంతమంది ఫ్యూచర్సిటీలో తమ గ్రామాలను కలపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఈ అంశాన్ని రేవంత్ దృష్టికి తీసుకెళ్లి, సభావేదికపై నిర్ణయం ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు. ప్రజలు రిక్వెస్ట్ చేస్తూ తీసుకొచ్చిన పత్రాలపై సంతకం చేసి, 37 గ్రామాలను ఫ్యూచర్సిటీలో కలపాలని అధికారుల్ని ఆదేశించారు. మహేశ్వరం మండలంలోని 28 గ్రామాలు, కందుకూరులోని 9 గ్రామాలు కలిపి మొత్తం 37 గ్రామాలు ఫ్యూచర్సిటీలో భాగం కానున్నాయి.
అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.20 కోట్లతో నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఛైర్మన్ హోదాలో తన ఛాంబర్లో ఫైల్పై సంతకం చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పోర్టల్ను ప్రారంభించారు. సీఎం రేవంత్కు ప్రధాన కార్యకలాపాలను, విభాగాలను ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక వివరించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికుల కోరిక మేరకు తాజాగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపామని.. భవిష్యత్తులో గ్రామాల వారీగా చర్చించి ఫ్యూచర్ సిటీలో కలుపుతామని హామీ ఇచ్చారు. కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వాళ్లను ప్రజలు తిరస్కరించారని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వారికి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు. ఫ్యూచర్ సిటీకి అడ్డుపడిన వారి సంగతి ప్రజలు చూసుకుంటారని.. వారే ఈ నగరాన్ని నిర్మించుకుంటారని అన్నారు.
హైదరాబాద్లో భూముల ధరలు బాగా పెరిగాయని.. సైబరాబాద్ ఒక సాంకేతిక విప్లవంగా తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు భూమి ధర ఎకరా రూ.200 కోట్లకు పైగా పలుకుతోందని అన్నారు. రంగారెడ్డి జిల్లా భూములకు బంగారం కంటే ఎక్కువ విలువ ఉందన్నారు. గతంలో హైటెక్ సిటీ అంటే నవ్వారని.. ఔటర్ రింగ్ రోడ్డును అడ్డుకున్నారని అన్నారు. గతంలోనూ నగర అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు, కుతంత్రాలు చేశారని ఆరోపించారు. గత పాలకులు హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జీనోమ్ వ్యాలీ వంటివి తీసుకురాకపోతే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చేవా weren’ అని అన్నారు. ప్రజలు ఈ విషయాలను ఆలోచించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.