Mamata Banerjee: దీదీ కి భారీ షాక్
- Author : Vamsi Chowdary Korata
Date : 11-06-2026 - 12:43 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ చిక్ బరైక్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పార్టీ నుంచి వైదొలిగిన మూడో రాజ్యసభ సభ్యుడు ఆయనే కావడం గమనార్హం. ఈ పరిణామం పార్టీలో తీవ్ర సంక్షోభానికి అద్దం పడుతోంది.
ఈరోజు ఉదయం రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ను కలిసి ప్రకాశ్ చిక్ తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, ఆయన తన రాజీనామాకు గల కారణాలను వెల్లడించలేదు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారా లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదే వారంలో టీఎంసీకి ఇది మూడో రాజీనామా. జూన్ 8న సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 10న మరో ఎంపీ సుస్మితా దేవ్ పార్టీని, పదవిని వీడారు. ఆమె బుధవారం ఢిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో సమావేశం కావడంతో త్వరలోనే బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రకాశ్ చిక్ బరైక్.. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా రాజకీయ వర్గాల్లో పేరుంది. 2023లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్లోని ఏదైనా నియోజకవర్గం నుంచి ఆయన్ను పోటీకి దింపాలని పార్టీలో చర్చలు జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పార్లమెంటు, శాసనసభ పక్షాలలో మొదలైన ఈ వరుస రాజీనామాలు టీఎంసీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.