Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్పై పోలీస్ కంప్లైంట్.. డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు
- Author : Vamsi Chowdary Korata
Date : 11-06-2026 - 12:33 IST
Published By : Hashtagu Telugu Desk
పోలీస్ కంప్లైంట్ మూవీ ప్రమోషన్లకు, డబ్బింగ్కు నటి వరలక్ష్మి శరత్ కుమార్ సహకరించలేదంటూ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై వరలక్ష్మి స్పందించారు. వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేదని చెప్తూనే, టీమ్కు సహకరించానని, తనకు సాధ్యమైనప్పుడల్లా ఈవెంట్లకు హాజరయ్యానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడుతూ.. తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోతుంటానని పేర్కొన్నారు.
నటి వరలక్ష్మీ శరత్ కుమార్పై డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఇటీవల చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఆయన దర్శకత్వంలో వరలక్ష్మి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ అనే సినిమా రేపు జూన్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్లో వరలక్ష్మి పాల్గొనడం లేదు. వరలక్ష్మి డబ్బులు తీసుకొని కూడా ప్రమోషనల్ ఈవెంట్స్కు రావడం లేదని, మూడు నెలలు డబ్బింగ్ చెప్పకుండా తమను ఏడిపించిందని సంజీవ్ ఆరోపించారు. దీనిపై వరలక్ష్మి స్పందించారు.
‘పోలీస్ కంప్లైంట్’ వివాదంపై వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయడానికి తాను ఇష్టపడటం లేదని అన్నారు. అయితే సినిమాకు తాను అవసరమైనప్పుడు టీమ్తో ఉన్నానని, ఈవెంట్స్కు హాజరయ్యానని తెలిపారు. ”వాళ్లకు అవసరమైనప్పుడల్లా నేను అందుబాటులోనే ఉన్నాను. సినిమాకు సంబంధించిన ప్రతి ఈవెంట్కు హాజరయ్యాను. ఇటీవలి ఈవెంట్లో దర్శకుడు ఏం మాట్లాడారో నాకు పూర్తిగా తెలియదు. కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అందుకే వారు చేస్తున్న ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించాలని నేను అనుకోవడం లేదు” అని వరలక్ష్మి అన్నారు. ‘అరిచే కుక్కలు కరవడం చాలా అరుదు. నేను అరవను, కరుస్తాను’ అంటూ తాను అందరిలా ఆరోపణలు చేయలేనని, తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోతానని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు.
పోలీస్ కంప్లైంట్ సినిమా ప్రమోషన్స్కు వరలక్ష్మి శరత్ కుమార్ సహకరించలేదని, ఆమె కారణంగా ఈ సినిమాకు భారీ నష్టం వాటిల్లిందని దర్శకుడు సంజీవ్ మేగోటి తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆరోపించారు. క్రమశిక్షణలో ఆమె ‘లేడీ బాలయ్య’ అని చాలామంది తనతో చెప్పారని, సినిమా షూటింగ్ విషయంలో ఎంతో శ్రమించినప్పటికీ.. ప్రమోషన్స్కు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బింగ్ సమయంలోనూ ఇబ్బందులు పెట్టారని తెలిపారు. మూడు నెలలు డబ్బింగ్ చెప్పకుండా ఏడిపించారని, ఆ సమయంలో ఆమె తన డైరెక్షన్లో ‘సరస్వతి’ సినిమా పూర్తి చేసుకున్నారన్నారు.
ప్రమోషన్స్కు రమ్మని ఆమెను అభ్యర్థించినా, తనకు సమయం లేదని చెప్పిందని డైరెక్టర్ సంజీవ్ తెలిపారు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు, 94 ఏళ్ల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వంటి వారు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకుంటుంటే, వరలక్ష్మి మాత్రం రెమ్యూనరేషన్ తీసుకుని కూడా పబ్లిసిటీకి రాకపోవడం లేదని ఆరోపించారు. తాజాగా దర్శకుడి ఆరోపణలకు వరలక్ష్మి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. దీనిపై ‘పోలీస్ కంప్లైంట్’ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.