Vivek Vs Premsagar : అధిష్ఠానం అన్యాయం చేస్తే సహించను.. ప్రేమ్సాగర్రావు సంచలన వ్యాఖ్యలు
ఆదివారం రోజు సీనియర్ నేత జానారెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Vivek Vs Premsagar) విమర్శలు చేయగా.. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కుటుంబం లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆరోపణలు చేశారు.
- By Pasha Published Date - 05:14 PM, Mon - 14 April 25

Vivek Vs Premsagar : మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య ఏర్పడిన విభేదాలు వరుస పెట్టి బయటపడుతున్నాయి. ఆదివారం రోజు సీనియర్ నేత జానారెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Vivek Vs Premsagar) విమర్శలు చేయగా.. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కుటుంబం లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆరోపణలు చేశారు. మంత్రి పదవి దక్కకుండా చేసి, తన గొంతు కోసేందుకు ఓ కుటుంబం యత్నిస్తోందని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆరోపించారు. తన గొంతు కోస్తుంటే ఊరుకోబోనని, ఆ కుటిల యత్నాలను తిప్పికొడతానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అధిష్ఠానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు.మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ ప్రేమ్సాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :WhatsApp Sale: వాట్సాప్, ఇన్స్టాలను జుకర్బర్గ్ అమ్మేస్తారా ?
పదేళ్లు పార్టీని కాపాడినందుకు ఇదేనా మాకిచ్చే గౌరవం ?
‘‘మంత్రివర్గంలో నాకు చోటు లేకుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్టే. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా? వేరే పార్టీల నుంచి తిరిగొచ్చిన వారికి మంత్రి పదవులు కావాలా? పదేళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకిచ్చే గౌరవం. ఇంద్రవెల్లి సభతో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోశాను’’ అని ప్రేమ్సాగర్ రావు గుర్తు చేశారు.
Also Read :Blatant Mistake: షాకింగ్ పోలీసింగ్.. నిందితుడి బదులు జడ్జిని వెతికిన ఎస్సై
మంత్రి పదవి రేసుతో ఉత్కంఠ
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవ్వరికీ ప్రాతినిధ్యం లేదు. అందుకే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ జిల్లా పరిధిలోని 10 శాసనసభ స్థానాల్లో ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ గెలిచింది. ఈ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నారు. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండటం ప్రేమ్సాగర్రావుకు ప్లస్ పాయింట్. వివిధ పార్టీలు మారి.. చివరగా ఎన్నికల సమయానికి కాంగ్రెస్లో చేరడం అనేది వివేక్ వెంకటస్వామికి మైనస్ పాయింట్. ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.