Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత
- Author : Vamsi Chowdary Korata
Date : 27-03-2026 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
Kalvakuntla Kavitha తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే.
మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అధ్వయ కన్వెన్షన్లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు ఆమె వివరించారు. నేడు శ్రీరామనవమి పర్వదినం కావడంతో, పార్టీకి సంబంధించిన కీలక అప్డేట్ ఇస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా కవిత స్పందిస్తూ, ‘‘ఇప్పటివరకు మగవాళ్లు పెట్టిన పార్టీలనే చూశారు. ఇప్పుడు ఓ తెలంగాణ ఆడబిడ్డగా నేను పార్టీ పెడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారు’’ అని అన్నారు. తమ పార్టీలో యువత, మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
తెలంగాణ జాగృతి ద్వారా ఇప్పటికే ప్రజల్లో ఉన్న కవిత, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి సొంత పార్టీతో అడుగుపెట్టనుండటం ఆసక్తి రేపుతోంది. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణపై ఏప్రిల్ 25న పూర్తి స్పష్టత రానుంది.