KTR Reaction: కవితకు పంపింది ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు: కేటీఆర్
తాజాగా ఐటీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ (KTR) ఈడీ నోటీసులపై రియాక్ట్ అయ్యారు.
- Author : Balu J
Date : 09-03-2023 - 1:26 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఢిలీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహరంపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ అంతగా భయపడాల్సిన అవసరమే లేదంటూ కవితకు ధైర్యం చెప్పారు. తాజాగా ఐటీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ (KTR) రియాక్ట్ అయ్యారు.
తమ మంత్రులపై ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశారని.. బీజేపీ దర్యాప్తు సంస్థలను ఇలా ఉసిగొల్పుతోందని తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణ భవన్లో మంత్రులతో కలిసి ప్రెస్మీట్ నిర్వహించిన కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. కవితకు పంపింది ఈడీ సమన్లు కాదని మోదీ సమన్లని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏదో జరుగుతోందని భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నీతిలేని పాలకుల అవినీతి ప్రభుత్వంగా కేంద్రం మారిందని, మోదీ చేతుల్లో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ అని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
అదానీ మోదీ బినామీ అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడని మంత్రి వ్యాఖ్యానించారు. అదానీ పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా చర్యలు లేవని, నిబంధనలకు విరుద్ధంగా 6 పోర్టులను అదానీకి ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఎల్ఐసీ డబ్బులు ఆవిరైతే ప్రధాని ఉలకడు.. పలకడని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని, ఈడీ, సీబీఐ విపక్షాలపైనే 90 శాతం దాడులు చేశాయని కేటీఆర్ (KTR) విమర్శించారు. ప్రధాని మోదీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
Also Read: PM With PM: పీఎం మోడీతో ఆస్ట్రేలియా పీఎం సెల్ఫీ.. ఫొటో వైరల్!