ఆక్సిజన్ సిలిండర్తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి
- Author : Vamsi Chowdary Korata
Date : 17-03-2026 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి పట్టుదల స్ఫూర్తి నింపగా, మరోచోట పరీక్షల విధుల్లో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఆక్సిజన్ సిలిండర్తో పరీక్ష రాసిన విద్యార్థి
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన కట్టా కౌశిక్చంద్ అనే విద్యార్థి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి, ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. అయితే, శస్త్రచికిత్సకు రూ.50 లక్షలకు పైగా ఖర్చవుతుందని, అంత స్థోమత తమకు లేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్దనే తాత్కాలిక వైద్యం అందిస్తున్నారు.
అయినా ఏమాత్రం వెనకడుగు వేయని కౌశిక్, ఎలాగైనా పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొంది, కొత్తపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రానికి ఆక్సిజన్ సిలిండర్తో హాజరయ్యాడు. ముక్కుకు మాస్క్ పెట్టుకుని ఆక్సిజన్ తీసుకుంటూనే తెలుగు పరీక్ష రాసి తన అకుంఠిత దీక్షను చాటుకున్నాడు. అతని పట్టుదల అందరినీ కదిలించింది.
పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిన హెడ్ మాస్టర్
కర్నూలు జిల్లాలో జరిగిన మరో ఘటన అందరినీ కలచివేసింది. నిడ్జూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన షేక్ అన్వర్బాషా, మాధవనగర్లోని ఓ పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్గా విధులకు హాజరయ్యారు. సోమవారం ఉదయం విధి నిర్వహణలో ఉండగానే ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. అన్వర్బాషాకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అన్వర్బాషా అకాల మరణంతో తోటి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.